ఇజ్రాయిల్ - లెబనాన్ ల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు
ఇజ్రాయిల్ మరోసారి దాడులకు దిగింది. హిజ్బుల్లా చీఫ్ ఈ దాడుల్లో మరణించాడు.
ఇజ్రాయిల్ మరోసారి దాడులకు దిగింది. హిజ్బుల్లా చీఫ్ ఈ దాడుల్లో మరణించాడు. బీరూట్ దక్షిణ ప్రాంత నగరాల్లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హిజ్బుల్లా చీఫ్ ఆఫ్ స్టాఫ్ హయతమ్ ఆలి తమై మృతి చెందాడు. జూన్ తర్వాత మొదటిసారిగా రాజధానిపై దాడి జరగడం ఇది. లెబనాన్ ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం, దాడిలో ఐదుగురు మరణించారు. ఈ వైమానిక దాడుల కారణంగా ఇరవై ఐదు మంది వరకూ గాయాలపాలయ్యారు. దాడి జరిగిన ప్రదేశంలో ఉన్న కార్లు, అపార్ట్మెంట్ భవనం పూర్తిగా దెబ్బతిన్నాయి. హిజ్బుల్లా తైతాభాయ్ మరణాన్ని ధృవీకరించింది.
ఏడాది తర్వాత...
గత సంవత్సరం ఇజ్రాయెల్–హిజ్బుల్లా యుద్ధం తర్వాత కుదిరిన కాల్పుల విరమణకు సరిగ్గా సంవత్సరం తర్వాత దాడి జరగడం పరిస్థితులను మళ్లీ ఉద్రిక్తం చేసే అవకాశం ఉందని హిజ్బుల్లా ప్రకటించింది. ఇదే సమయంలో పోప్ లియ తొలిసారి లెబనాన్ పర్యటనకు రావడానికి మరికొన్ని రోజులకు ముందు ఈ దాడులు జరగడంపై కూడా చర్చ జరుగుతుంది. అయితే ఈదాడులను ఇజ్రాయిల్ సమర్థించుకుంది. తమకు ఇబ్బంది కలిగించే ఏ రకమైన చర్యను ఉపేక్షించబోమని మరొకసారి హెచ్చరికలు జారీ చేసింది.
తిరిగి ఉద్రిక్తతలు...
ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఉత్తర ప్రాంత ప్రజలకు ప్రమాదం కలిగించే ఏ చర్యనైనా అడ్డుకునేందుకు కఠినంగా స్పందిస్తామని చెప్పారు. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఉత్తర ఇజ్రాయెల్ నివాసితులు తమ దైనందిన పనులను కొనసాగించాలని సైన్యం సూచించింది. అంటే హిజ్బుల్లా వెంటనే ప్రతిస్పందిస్తుందని తాము భావించడం లేదని మాత్రం పేర్కొనడం గమనార్హం. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాత్రం హిజ్బుల్లా పునరాయుధీకరణ కార్యక్రమాలకు తైతాభాయ్ నేతృత్వం వహిస్తున్నాడని ఆరోపించడం విశేషం.