Ethiopia landslide : దక్షిణ ఇథియోపియోలో వర్ష బీభత్సం.. యాభై మంది మృతి...125 మంది గల్లంతు
దక్షిణ ఇథియోపియాలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడి తీవ్ర విషాదం మిగిల్చాయి
దక్షిణ ఇథియోపియాలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడి తీవ్ర విషాదం మిగిల్చాయి. ఈ ఘటనల్లో కనీసం 50 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 125 మంది గల్లంతయ్యారని అధికారులు గురువారం వెల్లడించారు. గామో జోన్లోని గాచో బాబా, కాంబా, బోంకే జిల్లాల్లో గత కొన్ని రోజులుగా కొండచరియలు విరిగి పడిన ఘటనలు జరిగాయని గామో జోన్ విపత్తు ప్రతిస్పందన డైరెక్టర్ మెస్ఫిన్ మానుకా చెప్పారు. రక్షణ చర్యల్లో భాగంగా మట్టిలో చిక్కుకున్న ఒకరిని ప్రాణాలతో బయటకు తీసినట్లు ఆయన తెలిపారు.
వర్షాలు కొనసాగుతుండటంతో...
గాచో బాబా జిల్లా కమ్యూనికేషన్ అధికారి అబేబే అజెనా మాట్లాడుతూ, మృతుల్లో ఎక్కువ మంది మట్టిలో పాతుకుపోయిన స్థితిలో కనిపించారని చెప్పారు. ఈ ఘటనల వల్ల ఎంతమంది కుటుంబాలు ప్రభావితమయ్యాయన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదన్నారు.దక్షిణ ఇథియోపియా ప్రాంతీయ రాష్ట్ర అధ్యక్షుడు టిలాహున్ కెబెడే ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు.
గత ఏడాది కూడా...
“ఇప్పుడు వర్షాకాలం కొనసాగుతోంది. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరిగే అవకాశం ఉంది. పర్వత ప్రాంతాలు, వరదలకు గురయ్యే ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి,” అని ఆయన చెప్పారు.భారీ వర్షాల కారణంగా మట్టిచరియలు, వరదలు ఇథియోపియాలో తరచూ కనిపిస్తుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటాయి. గత సంవత్సరం జూలైలో కూడా భారీ వర్షాల కారణంగా దక్షిణ ఇథియోపియాలో జరిగిన మట్టిచరియల్లో 229 మంది ప్రాణాలు కోల్పోయారు.