ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య యుద్ధం పదమూడో రోజుకు చేరుకుంది. యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు కనిపించడం లేదు.ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతొల్లా మొజ్తబా ఖమేనీ గల్ఫ్ అరబ్ దేశాలపై దాడులు కొనసాగిస్తామని ప్రకటించారు. అవసరమైతే కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసివేసి అమెరికా, ఇజ్రాయెల్పై ఒత్తిడి పెంచుతామని హెచ్చరించారు. ఇజ్రాయెల్ దాడిలో మరణించిన తన తండ్రి తరువాత బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఇచ్చిన మొదటి ప్రజా ప్రకటన ఇది. 56 ఏళ్ల మొజ్తబా ఖమేనీ యుద్ధం ప్రారంభ దశలో గాయపడినట్టు ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. అప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించలేదు. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను ప్రజలు మూసివేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. వాషింగ్టన్ ఇచ్చే రక్షణ హామీలు “ఖాళీ మాటలు” మాత్రమేనని అన్నారు.
ప్రతీకారం తీర్చుకుంటాం...
ప్రతీకారం తీర్చుకుంటామని ఖమేనీ చెప్పారు. ఒక పాఠశాలపై జరిగిన దాడిలో 165 మందికి పైగా మరణించిన ఘటనను ఆయన ప్రస్తావించారు. ఈ యుద్ధాన్ని కొనసాగించే సంకేతాలే ఆయన ప్రకటనలో కనిపించాయి. ఇప్పటికే ఈ ఘర్షణ వల్ల ప్రపంచ ఇంధన సరఫరా, అంతర్జాతీయ ప్రయాణాలపై ప్రభావం పడింది. గల్ఫ్ దేశాలు అనుభవిస్తున్న భద్రతా పరిస్థితులపైనా దాని ప్రభావం కనిపిస్తోంది. ప్రకటన సమయంలో ఖమేనీ కెమెరా ముందు కనిపించలేదు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో నౌకాయాన మార్గాలు, ఇంధన వసతులపై ఇరాన్ దాడులు పెరగడంతో చమురు ధరలు మళ్లీ బ్యారెల్కు 100 డాలర్లకు పైగా చేరాయి.
యుద్ధం తీవ్రతరం…
అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ నాయకత్వం, సైన్యం, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి భారీ నష్టం జరిగింది. అయినా ప్రభుత్వాన్ని కూల్చడంలో అవి విఫలమయ్యాయి. ఇరాన్ పాలనను కూల్చడం తన లక్ష్యమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని సందర్భాల్లో సూచించారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన దాడుల్లో సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో పాటు మొజ్తబా ఖమేనీ భార్య కూడా మరణించారు. మరోవైపు “పని పూర్తిచేస్తాం” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ అణ్వస్త్రం అభివృద్ధి చేయకుండా ఆపడం చమురు ధరల కంటే పెద్ద ప్రాధాన్యమని ఆయన సోషల్ మీడియాలో తెలిపారు. లెబనాన్ నుంచి ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా యోధులు ఉత్తర ఇజ్రాయెల్పై సుమారు 200 రాకెట్లు ప్రయోగించారు. మరోవైపు ఇజ్రాయెల్ తేహ్రాన్, లెబనాన్ ప్రాంతాలపై మళ్లీ దాడులు చేసింది. ఆ దాడుల్లో 11 మంది మరణించారు.
నివాసాలు వదిలి...
ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ తెలిపిన వివరాల ప్రకారం యుద్ధం కారణంగా ఇరాన్లో 32 లక్షల వరకు ప్రజలు నివాసాలు వదిలి వెళ్లారు. వారిలో ఎక్కువ మంది తేహ్రాన్ సహా ప్రధాన నగరాల నుంచి ఉత్తర ప్రాంతాలు, గ్రామాలకు వెళ్లినట్టు తెలిపింది. లెబనాన్లో సుమారు 8 లక్షల మంది దేశం విడిచి వెళ్లిపోయారు. దీంతో మానవతా సంక్షోభం ముదురే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమైంది.అమెరికా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా తన తండ్రి అనుసరించిన వ్యూహాన్నే కొనసాగిస్తామని ఖమేనీ సంకేతం ఇచ్చారు. గల్ఫ్ అరబ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలను మూసివేయాలని ప్రజలను కోరారు. యుద్ధం కొనసాగితే శత్రువుకు అనుభవం తక్కువగా ఉన్న కొత్త రంగాల్లో పోరాటం ప్రారంభించే అవకాశాలను కూడా ఇరాన్ పరిశీలిస్తోందని తెలిపారు. దీనిపై ఆయన వివరాలు చెప్పలేదు. గతంలో ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలపై జరిగిన దాడులతో ఇరాన్కు సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
హోర్మోజ్ జలసంధిని మూసివేసి...
ఇంధన వసతులపై దాడులతో పాటు పర్షియన్ గల్ఫ్ నుంచి ఇండియన్ ఓషన్కు వెళ్లే కీలక జలమార్గమైన హోర్ముజ్ జలసంధిని కూడా ఇరాన్ మూసివేసింది. ప్రపంచంలో వాణిజ్యంగా రవాణా అయ్యే చమురులో దాదాపు ఐదో వంతు ఈ మార్గం గుండా వెళ్తుంది. ఈ పరిస్థితుల్లో బ్రెంట్ క్రూడ్ చమురు ధర మరో 9 శాతం పెరిగి బ్యారెల్కు 100 డాలర్లకు పైగా చేరింది. యుద్ధం మొదలైనప్పటి ధరతో పోలిస్తే ఇది సుమారు 38 శాతం ఎక్కువ. ఇటీవల ఒక దశలో ధరలు 120 డాలర్ల వరకు చేరాయి.
ఇజ్రాయెల్–హిజ్బుల్లా మధ్య కాల్పులు...
ఇజ్రాయెల్, లెబనాన్ ప్రాంతాల్లో రాత్రంతా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. హిజ్బుల్లా సుమారు 200 రాకెట్లు ప్రయోగించిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. బీరుట్ దక్షిణ ఉపనగరాలు సహా పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు దాడులు చేశాయి. లెబనాన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న క్లిల్ గ్రామానికి చెందిన నివాసి నామా పోరాట్ మాట్లాడుతూ, “పేలుళ్ల శబ్దం భయంకరంగా వినిపించింది. నేను నా కుమారుడితో కలిసి ఆశ్రయం కేంద్రానికి పరుగెత్తి రాత్రంతా అక్కడే ఉన్నాం” అన్నారు. లెబనాన్ ప్రభుత్వం హిజ్బుల్లా దాడులను ఆపకపోతే ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని మేమే చర్యలు తీసుకుంటామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ హెచ్చరించారు. 2024లో ఇజ్రాయెల్తో జరిగిన యుద్ధం తర్వాత కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తరువాత హిజ్బుల్లా ఆయుధాలు వదిలేయాలని లెబనాన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. అయితే మిలిటెంట్లను నేరుగా ఎదుర్కొనే విషయంలో మాత్రం ప్రభుత్వం వెనుకంజ వేస్తోంది.