ఫ్యాక్ట్ చెక్: ఏపీలో లోడ్ రిలీఫ్ పవర్ కట్స్ అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు

ఏపీలో లోడ్ రిలీఫ్ పవర్ కట్స్

Update: 2025-06-12 11:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ మీటర్లను తీసుకుని వచ్చారు. జూన్ నెలలో ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ బిల్లులు ఎక్కువగా వచ్చాయని కూటమి ప్రభుత్వంపై విమర్శలు కూడా వచ్చాయి. అకస్మాత్తుగా ఈ నెలలో పెరిగిన విద్యుత్ బిల్లుల గురించి అనేక పోస్టులు సోషల్ మీడియాలో వెలిశాయి.

ఏపీ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఈ పరిస్థితిపై స్పందించారు. స్మార్ట్ మీటర్‌తో బిల్లు పెరిగిందని మా దృష్టికి వచ్చింది. స్మార్ట్ మీటర్ల పనితీరుపై క్షేత్ర స్థాయిలో వెంటనే విచారణ నిర్వహించి, సమగ్ర నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించానని తెలిపారు. "స్మార్ట్ మీటర్ తో బిల్లు ఎక్కువ వచ్చిందన్న విషయం మా దృష్టికి వచ్చింది..వెంటనే క్షేత్ర స్థాయిలో స్మార్ట్ మీటర్ల పనితీరుపై విచారణ జరిపి, సోమవారం నాటికి సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించాను. కచ్చితంగా స్మార్ట్ మీటర్ల పనితీరుపై కూలంకుశంగా అధ్యయనం చేస్తాం..ఎక్కువ బిల్లులుు రాకుండా తగిన చర్యలు తీసుకుంటాం. విద్యుత్ బిల్లుల పేరుతో ఎవరిపైనా ఒక్క రూపాయి భారం మోపేది లేదు..ఇది ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించే బాధ్యతాయుతమైన ప్రభుత్వం." అంటూ ఆయన ట్వీట్ కూడా చేశారు.

స్మార్ట్ మీటర్ల కారణంగా ఎక్కువ విద్యుత్తు బిల్లులు వస్తున్నాయని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ డిస్కంలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే అధిక బిల్లులపై నివేదికను కోరిన మంత్రి గొట్టిపాటి స్మార్ట్ మీటర్ల పనితీరును అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు.

ఇంతలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిరోజూ 3 నుండి 5 గంటల వరకు విద్యుత్ కోతలు ఉంటాయని సోషల్ మీడియాలో పోస్టులు ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించాయి.

సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయిన పోస్ట్ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకు 3 నుండి 5 గంటల వరకు "లోడ్ రిలీఫ్ పవర్ కట్స్" అమలు చేస్తుంది. ప్రతి రోజు అందుబాటులో ఉన్న విద్యుత్ సరఫరాను బట్టి విద్యుత్ కోతలు మారుతూ ఉంటాయి.
గ్రామీణ ప్రాంతాలు: సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు
మున్సిపాలిటీలు: రాత్రి 9 నుండి అర్ధరాత్రి వరకు
నగరాలు: రాత్రి 11 నుండి ఉదయం 3 గంటల వరకు అంటూ పోస్టును వివిధ సోషల్ మీడియా వేదికలలో అప్లోడ్ చేశారు.



వైరల్ అవుతున్న పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు



 


ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

మేము వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇవే పోస్టులు 2021 సంవత్సరంలో కూడా వైరల్ అయ్యాయి.

అప్పుడు కూడా ఇదంతా ఫేక్ న్యూస్ అంటూ పలు సోషల్ మీడియా ఖాతాలలో పోస్టులు పెట్టారు.



మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా AP ఫ్యాక్ట్ చెక్ విభాగం తన సోషల్ మీడియా ఖాతాలలో వైరల్ పోస్టులను ఖండిస్తూ పోస్టు పెట్టింది.

"ఆంధ్రప్రదేశ్ లో 'లోడ్ రిలీఫ్ పవర్ కట్' పేరిట ఈరోజు నుంచి రోజుకు 3-5 గంటల పాటు విద్యుత్ సరఫరాలో కోతలు ఉంటాయని కొందరు చేస్తున్న ప్రచారం అవాస్తవమని... ఇందులో ఏ మాత్రం నిజం లేదని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. కాబట్టి ప్రజలారా! ఇలాంటి ఫేక్ వార్తలను ప్రజలెవరూ నమ్మొద్దు." అంటూ AP ఫ్యాక్ట్ చెక్ విభాగం ట్వీట్ వేసింది.

ఇప్పుడు లేదా సమీప భవిష్యత్తులో లోడ్ రిలీఫ్ విద్యుత్ కోతలను అమలు చేసే ప్రణాళిక లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ అధికారులు కూడా ధృవీకరించారు. అటువంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని లేదా వ్యాప్తి చేయవద్దని ప్రజలను కోరారు.

ఇందుకు సంబంధించిన సమాచారం కోసం APSPDCL అధికారిక వెబ్సైట్ ను కూడా మేము పరిశీలించాం. ఎక్కడా కూడా కరెంట్ కోతలకు సంబంధించిన ప్రకటనలు లభించలేదు.


ఇక ఆంధ్రప్రదేశ్ లో 'లోడ్ రిలీఫ్ పవర్ కట్' పేరిట కరెంట్ కోతలు ఉంటాయంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని పలు మీడియా సంస్థల కథనాలు మాకు లభించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.

కాబట్టి, ఏపీలో లోడ్ రిలీఫ్ పవర్ కట్స్ ను అమలు చేస్తున్నారంటూ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.


Claim :  ఏపీలో లోడ్ రిలీఫ్ పవర్ కట్స్
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News