ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం.. ఎందులో తెచ్చారో తెలుసా?

ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చే వారు అధికారుల కళ్లుగప్పి తీసుకువచ్చేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుంటారు.

Update: 2023-11-19 07:12 GMT

ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చే వారు అధికారుల కళ్లుగప్పి తీసుకువచ్చేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుంటారు.అయినా చివరికి విమానాశ్రయంలో పట్టుబడిపోతారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి దొరికిపోతుంటారు. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒకే విమానంలో ప్రయాణించిన ఇద్దరు ప్రయాణికుల నుంచి సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్‌ అధికారులు. వీరిలొ ఒకరిని అరెస్టు చేసి విచారణ చేపడుతున్నారు.

కోజికోడ్‌కు చెందిన సుహైబ్ (35)ను కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గోల్డ్‌ స్మగ్లింగ్ కోసం వీళ్లు చేసిన పనికి అధికారులు సైతం బిత్తరపోయారు. సుహైబ్ నుంచి ఫ్లాస్క్‌లో దాచి తెచ్చిన 1.959 కిలోల బంగారం మిశ్రమాన్ని అధికారులు గుర్తించారు. పట్టుబడిన బంగారు మిశ్రమం విలువ దాదాపు రూ.1.2 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

తిరువనంతపురం, కమలేశ్వరానికి చెందిన మరో ప్రయాణికుడు ముహమ్మద్ అఫ్సర్ (25) కూడా బంగారు ద్రావణాన్ని లుంగీలో దాచి తీసుకువస్తుండగా, కస్టమ్స్‌ అధికారులకు పట్టుబడ్డాడు. గోల్డ్‌ కోటెడ్‌తో మడిచిపెట్టి అక్రమంగా తరలిస్తున్న10 లుంగీలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా, బంగారం ద్రావణంలో ముంచిన లుంగీల బ్యాగ్‌ను ఎక్స్‌రేతో తనిఖీ చేయగా, అసలు విషయం బట్టబయలైంది.

లుంగీ నుంచి బంగారాన్ని వేరు చేసి కొచ్చిలోని కస్టమ్స్ ల్యాబొరేటరీకి పంపారు. ఈ లుంగీల్లో సుమారు కిలో బంగారం ఉన్నట్లు అంచనా వేశారు అధికారులు. దీని ధర దాదాపు 60 లక్షల రూపాయలు ఉంటుంది. వీరిద్దరూ నిన్న ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ఎమిరేట్స్ విమానంలో భారత్‌కు వచ్చినట్టుగా అధికారులు తెలిపారు. స్మగ్లింగ్‌ చేసేవారి తెలివి మితిమీరిపోతుంది. విదేశాల నుంచి మన దేశానికి గుట్టుచప్పుడు కాకుండా బంగారాన్ని తరలించేందుకు కొత్త కొత్త ప్లాన్స్‌ చేస్తున్నారు. అయినా లాభం లేకుండా పోతోంది. చిరికి ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టగానే కస్టమ్స్‌ అధికారులకు దొరికిపోతున్నారు.

Tags:    

Similar News