బ్యాంకు లోన్‌ ఈఎంఐ చెల్లించకపోతే ఏమవుతంది? తీసుకునే జాగ్రత్తలు!

బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం అనేది సర్వధారణం. పర్సనల్‌ లోన్‌, గృహ రుణాలు, వాహనానికి సంబంధించిన రుణాలు తీసుకుంటాము..

Update: 2023-08-11 05:18 GMT

బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం అనేది సర్వధారణం. పర్సనల్‌ లోన్‌, గృహ రుణాలు, వాహనానికి సంబంధించిన రుణాలు తీసుకుంటాము. అయితే రుణం తీసుకునే ముందు బ్యాంకు నుంచి ఎంతో ప్రాసెస్‌ ఉంటుంది. సిబిల్ స్కోర్‌ మెరుగ్గా ఉంటే తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తాయి బ్యాంకులు. అయితే బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్న తర్వాత వాటిని సమయానికి చెల్లించాలి. లేకపోతే అధిక వడ్డీలు వేయడంతో పాటు బ్యాంకు అధికారులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. అలా వాయిదాలు.. వాటిపై వడ్డీ, రుసుములు పెరిగి ఓ పెద్ద గుదిబండగా మారతాయి. ఒక్కోసారి తిరిగి చెల్లించలేని పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. మరి అలాంటప్పుడు బ్యాంకులు మన రుణాన్ని ఎలా వసూలు చేస్తాయి? మన ముందున్న మార్గాలు ఏమిటో తెలుసుకుందాం.

ఈఎంఐలు ఆలస్యం:

మామూలుగా ఆర్థిక ఇబ్బందుల కారణంగానో, ఇతర కారణాల వల్లనో రుణం తీసుకున్న తర్వాత ఈఎంఐలు కట్టడంలో ఇబ్బందులు వస్తుంటాయి. ఒకటి లేదా రెండు ఈఎంఐలు చెల్లించడంలో ఆలస్యమవుతుంది. ఇలాంటి సమయంలో బ్యాంకులు మీపై ఒత్తిడి తీసుకువస్తుంటాయి. ముందుగా ఫోన్‌లు చేస్తూ ఈఎంఐ చెల్లించాలని హెచ్చరిస్తుంటాయి. కొన్ని నెలల తర్వాత పరిస్థితి మరోలా ఉంటుంది. బ్యాంకులు మరింతగా ఒత్తిడి చేస్తాయి. కానీ, వరుసగా మూడు నెలల పాటు ఈఎంఐ చెల్లింపుల్లో జాప్యం జరిగిందంటే ప్రమాదం ముంచుకొస్తోందని భావించాలి. బ్యాంకులు వెంటనే అప్రమత్తమై మీ రుణాన్ని నిరర్ధక ఆస్తిగా గుర్తిస్తాయి. మీకు నోటీసులు జారీ చేస్తాయి. ఆ తర్వాత కూడా మీరు స్పందించకపోతే.. మిమ్మల్ని దివాలాదారుగా గుర్తించి ఇంటికి నోటీసులు పంపుతాయి. ఈ క్రమంలో మీ సిబిల్‌ స్కోర్‌ సైతం క్రమంగా దెబ్బతింటుంది.

ఇక మీరు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేరని బ్యాంకు భావించినట్లయితే తదుపరి చర్యలకు సిద్దమవుతుంది. సర్ఫేసీ చట్టం ప్రకారం 60 రోజుల గడువుతో తుది నోటీసు పంపుతుంది. ఇక ఈ నోటీసలు వచ్చిందంటే మీకు ఈఎంఐ చెల్లించేందుకు ఇదే చివరి అవకాశం అని భావించాల్సి ఉంటుంది. ఒకవేళ చెల్లించడంలో విఫలమైనట్లయితే.. మీకున్న ఆస్తిని బ్యాంకు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఏ న్యాయస్థానం, చట్టపరమైన జోక్యం అవసరం లేకుండానే ఈ పనిచేయవచ్చు. అందుకే బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలి. లేకపోతే తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే, బ్యాంకు ఇచ్చిన చివరి 60 రోజుల గడువులో మీరు బ్యాంకు అధికారుల దగ్గరకు వెళ్లి వివరణ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. రాతపూర్వకంగా మీ పరిస్థితిని వారికి తెలియజేసి వారిని ఒప్పించే ప్రయత్నం చేసే వెసులుబాటు ఉంటుంది. జరిమానాతో మరికొంతకాలం నోటీసు పీరియడ్‌ను పొడిగించే వెసులుబాటు కూడా ఉంటుంది. అయితే మీరు చెప్పిన కారణాలను బ్యాంకు సిబ్బంది నిరాకరించినట్లయతే చేసేదేమి ఉండదని గుర్తించుకోవాలి. మీకిచ్చిన గడువు ముగిసినట్లయితే బ్యాంకు ఏజెంట్లు మీ ఇంటి తలుపుతట్టే అవకాశం ఉంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వివరాల ప్రకారం.. మీ ఇంటికి వచ్చే బ్యాంకు ఏజెంట్ల గుర్తింపును మీరు ధృవీకరించేందుకు ఆధారాలు అడిగే అవకాశం కూడా ఉంటుంది. వారు వారి గుర్తింపు కార్డులతో పాటు, బ్యాంకు నుంచి ఆథరైజేషన్‌ లెటర్‌ కూడా వారి వద్ద ఉండాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతమున్న రోజుల్లో ఆర్బీఐ నిబంధనలు మరింత కఠినతరం చేస్తోంది.

ఇల్లు వేలం వేసే పరిస్థితి వస్తే ఏం చేయాలి?

బ్యాంకు రుణం ఈఎంఐలు చెల్లించని పక్షంలో రుణం ఇచ్చిన బ్యాంకులు గానీ, ఇతర సంస్థలు గానీ.. ఇంటి వాస్తవ విలువను అంచనా వేస్తాయి. తర్వాత వేలం ప్రక్రియను ప్రారంభిస్తాయి. వేలానికి సంబంధించిన వివరాలను దినపత్రికలో ప్రచురిస్తాయి. వేలంలో పేర్కొన్న విలువ తక్కువ అని యజమాని భావిస్తే సంస్థలను సంప్రదించవచ్చు. ఒకసారి ఇలా ఆస్తిని స్వాధీనం చేసుకున్న సంస్థలు దాన్ని విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం లేదా ఆ ఆస్తిపై హక్కులను వేరే సంస్థకు అప్పగించే అవకాశం ఉంటుంది. ఇది వేలం ద్వారా జరుగుతుంది. సంబంధిత ఇంటిని వేలంలో విక్రయించగా, వచ్చిన మొత్తం నుంచి బ్యాంకు ముందుగా తన రుణ బకాయిలను సర్దుబాటు చేసుకుంటుంది. అదనంగా ఏమైనా మిగిలితే ఆ మొత్తాన్ని రుణ చెల్లింపుల్లో విఫలమైన వ్యక్తికి తిరిగి ఇచ్చేస్తుంది.

మీ ముందున్న మరో మార్గం ఏమిటి?

ఇలాంటి సమయంలో మీకు మరో మార్గం ఉంటుంది. మిమ్మల్ని దివాలాదారుగా గుర్తించిన వెంటనే మీ ఇంటిని మీరే విక్రయించేందుకు ప్రయత్నించండి. వచ్చే సొమ్ముతో రుణాన్ని చెల్లించే ప్రయత్నం చేయండి. బ్యాంకులు కేవలం వారి రుణాన్ని రికవరీ చేసుకోవడంపైనే దృష్టి పెడతాయి. కాబట్టి మీ ఇంటికి సరైన ధర రావాలన్న దానిపై వారికి ఏమాత్రం ఆసక్తి ఉండకపోవచ్చు. అందుకే అలాంటి పరిస్థితి వచ్చినట్లయితే మీ ఇంటికి మీరే విక్రయిస్తే ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్యాంకులు విక్రయించినట్లయితే వారికి సరిపోయే డబ్బులకే విక్రయించే అవకాశం ఉంటుంది. అంటే తక్కువ ధరకే విక్రయించే అవకాశం ఉందన్నట్లు.

ఇలాంటి పరిస్థితి ఎదురు కావొద్దంటే ఏం చేయాలి?

మీ ఈఎంఐలు ప్రతినెలా మీ చేతికొచ్చే ఆదాయంలో 40 శాతానికి మించకుండా చూసుకోవడం మంచిదంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇంతకంటే మించితే చిన్న ఆర్థిక సమస్య తలెత్తినా.. రుణాలు చెల్లించక తీవ్రమైన ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. వీలైనంత ఎక్కువ డౌన్‌పేమెంట్‌ చెల్లిస్తే బాగుంటుంది. అలాంటి సమయంలో మీకు నెలవారీ ఈఎంఐ తక్కువగా ఉంటుంది. ఇంటిని కొనుగోలు చేసేటప్పుడే వీలైనంత ఎక్కువ డౌన్‌పేమెంట్‌ చెల్లించేందుకు ప్రయత్నించడం మంచిది. ఇలాంటి సమయంలో మీకు భారం పెద్దగా ఉండదు.

Tags:    

Similar News