డీజిల్‌ వాహనదారులకు కేంద్రం షాక్‌..!

దేశంలో డీజిల్‌వాహనాలపై నిషేధం విధించేందుకు కేంద్రం సిద్దమవుతోందని, డీజిల్‌ ఇంజన్లపై 10 శాతం జీఎస్టీ ..

Update: 2023-09-13 07:01 GMT

దేశంలో డీజిల్‌వాహనాలపై నిషేధం విధించేందుకు కేంద్రం సిద్దమవుతోందని, డీజిల్‌ ఇంజన్లపై 10 శాతం జీఎస్టీ విధించనుందనే వార్తలపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు కేంద్రం అలాంటి ఆలోచనేమి చేయడం లేదని స్పష్టం చేసిన ఆయన.. త్వరలో ఈ జీఎస్టీ విధించే అంశంపై చర్చించనున్నామని అన్నారు. సియామ్ (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్) కార్యక్రమంలో నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు. దీనిపై ఆయన ‘X’లో పోస్ట్ చేస్తూ స్పష్టతనిచ్చారు.

డీజిల్ వాహనాల విక్రయాలపై అదనంగా 10% జీఎస్టీని సూచిస్తూ వస్తున్న మీడియా నివేదికలపై తక్షణమే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. కార్బన్ నెట్ సాధించడానికి కట్టుబాట్లకు అనుగుణంగా డీజిల్ వాహనాలకు ‘బై-బై’ చెప్పండి. ఈ విషయంలో ఆటో పరిశ్రమ తనవంతుగా చర్యలు తీసుకోవాలని, లేకుంటే ప్రభుత్వం వాటిపై పన్నును పెంచి విక్రయించడం కంపెనీలకు కష్టంగా మారుతుంద నితిన్ గడ్కరీ అన్నారు.

తగ్గిన డీజిల్‌ కార్ల సంఖ్య

కాగా, 2014 సంవత్సరం నుంచి భారత్‌లో డీజిల్ కార్ల సంఖ్య తగ్గింది. తొమ్మిదేళ్ల క్రితం మొత్తం కార్లలో ఇవి 33.5 శాతం ఉండగా, ఇప్పుడు 28 శాతానికి తగ్గాయి. ఆటోమొబైల్ పరిశ్రమను డీజిల్‌కు దూరంగా స్వచ్ఛమైన ఇంధన ఎంపికలకు వేగంగా మార్చడమే ప్రభుత్వ ఈ చర్య ఉద్దేశ్యమని గడ్కరీ తెలిపారు. పర్యావరణానికి అనుకూలమైన ఇంధన ఎంపికలపై దృష్టి పెట్టడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాలుష్య రహిత వాహనాలను ప్రోత్సహించే విధంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. అధిక కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలకు చెక్‌ పెట్టే దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కాలుష్యాన్ని వెదజల్లే డీజిల్‌ వాహనాల ఉత్పత్తిని తగ్గించాలని, లేకపోతే పన్ను విధిస్తే తీవ్ర భారం మోయాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటి వరకు ఆ వాహనాలపై పన్ను విధించే ప్రతిపాదన లేదని, కానీ త్వరలో ఈ విషయంపై చర్చిస్తామన్నారు. 10 శాతం పన్ను విధించే అంశంపై కేంద్ర మంత్రి నిర్మలాసీతామన్‌కు ప్రతిపాదిస్తామని అన్నారు. డీజిల్‌ వాహనాలపై 10 శాతం జీఎస్టీ విధించాలని ఆయన అభిప్రాయపడ్డారు.


డీజిల్‌ వాహనాలే ఎందుకు..

అయితే దేశంలో అధిక శాతం వాణిజ్య వాహనాలు డీజిల్‌తోనే నడుస్తున్నాయి. దీని వల్ల కాలుష్యం పెరిగిపోతోంది. అందుకే డీజిల్‌ వాహనాల తయారీని నిలిపివేయాలని మంత్రి నితిన్‌ గడ్కరీ కోరారు. లేని పక్షంలో భారీగా పన్నులు పెంచాతామని పేర్కొన్నారు. అయితే డీజిల్‌ వాహనాలకు వీడ్కోలు పలకండి. వాటిని తయారు చేయడం మానేస్తే బాగుటుంది. లేకుంటే కార్లపై పన్ను విధిస్తే కంపెనీలకు ఇబ్బందిగా మారుతుంది అని ఈకార్యక్రమంలో చెప్పారు.




Tags:    

Similar News