ఎన్టీఆర్ నన్ను పెళ్లి చేసుకున్నారో లేదో చెప్పాల్సింది వాళ్లే: లక్ష్మీ పార్వతి

దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా

Update: 2023-08-28 09:30 GMT

దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా రూ. 100 విలువైన ఎన్టీఆర్ చిత్రంతో ఉన్న స్మారక నాణేన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్ లోని సాంస్కృతిక కేంద్రంలో ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిని పిలవకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి తనని పిలవాలని రాష్ట్రపతికి ఇంతకు ముందు లక్ష్మీ పార్వతి లేఖ రాశారు. అయినా ఆమె లేకుండానే ఈ కార్యక్రమాన్ని విడుదల చేశారు.

ఎన్టీఆర్ ప్రాణాలు తీసిన వాళ్ళు వారసులుగా చలామణి అవుతున్నారని.. భార్యగా నాణెం అందుకోవడానికి అర్హత తనకే ఉందని అన్నారు లక్ష్మీ పార్వతి. ప్రాణాలు తీసిన వాళ్ళు నాణెం విడుదలకు వెళ్లారని.. ఎన్నికల సమయంలో ఎన్టీఆర్‌ను వాడుకుంటున్నారన్నారు. ఎన్టీఆర్ తనను వివాహం చేసుకున్నారో లేదో ఆయన పిల్లలు సమాధానం చెప్పాలన్నారు. తనను పిలవకుండా పురందేశ్వరి, చంద్రబాబు అడ్డుకున్నారని.. ఎన్టీఆర్ భార్యను అని మెడలో ఫోటో పెట్టుకుని తిరగాలా అని ప్రశ్నించారు. ఆయనతో వివాహమైనట్లు ఫోటోలు, వార్తా కథనాలు ఉన్నాయన్నారు. ఇంతకాలం ఎన్టీఆర్ కుటుంబంపై అభిమానంతో సైలెంట్‌గా ఉన్నానని.. ఇకపై ఆ కుటుంబాన్ని వదిలిపెట్టనన్నారు. చంద్రబాబు, పురందేశ్వరి, బాలకృష్ణ అందరినీ బయటకు లాగుతానన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత వీళ్లు రాజకీయాల్లో ఉండకుండా చేస్తానన్నారు. వీళ్ల గురించి ఎన్టీఆర్ ఏమన్నారో ప్రజలకు వివరిస్తానన్నారు. ఎన్నాళ్లని వీళ్ల నుంచి అవమానాలు పడుతూ ఉండాలన్నారు. ఎన్టీఆర్ కష్టాల్లో ఉంటే పురందేశ్వరి వచ్చారా అని ప్రశ్నించారు. తనను ఎందుకు చులకన చేస్తున్నారని, తనను చులకన చేస్తే ఎన్టీఆర్‌ను చేసినట్టే అన్నారు. భువనేశ్వరి, పురందేశ్వరిలు తండ్రికి ద్రోహం చేశారని అన్నారు. కేంద్రం భారతరత్న ఇస్తానంటే పురందేశ్వరి అడ్డుకున్నారని ఆరోపించారు.


Tags:    

Similar News