Ys jagan : నేడు జగన్ తో బాలినేని, మాగుంట భేటీ.. కారణమిదే
ముఖ్యమంత్రి జగన్ తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి భేటీ కానున్నారు
వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి భేటీ కానున్నారు. జిల్లాలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు జగన్ తో చర్చించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాలలో అభ్యర్థులు మార్పులు, చేర్పులపై ఇటీవల వైసీపీలో అనేక నిర్ణయాలు వెలువడిన నేపథ్యంలో వీరి సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.
మార్పులు.. చేర్పులతో...
గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో నాలుగు స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. ఈసారి అత్యధికంగా ఆ జిల్లాలో గెలుపు సాధించేందుకు జగన్ వీరికి దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే మంత్రి ఆదిమూలపు సురేష్ ను యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి కొండపి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా మార్చారు. సంతనూతలపాడు ఇన్ఛార్జిగా మరో మంత్రి మేరుగ నాగార్జునను నియమించారు. అద్దంకి నియోజకవర్గంలో కూడా ఇన్ఛార్జిని మార్చారు. దీంతో మరికొన్ని నియోజకవర్గాలపై కూడా జగన్ నిర్ణయం తీసుకునే అవకాశముందన్న ప్రచారం వినపడుతున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ జిల్లా వైసీపీ నేతల్లో వణుకు పుట్టిస్తుంది.