మార్గదర్శి కుంభకోణం ఊహించిన దాని కంటే చాలా పెద్దది: ఏపీ సీఐడీ

ప్రజలకు ఎక్కువ వడ్డీ ఇస్తామనే ఆశ చూపి చందాదారుల డబ్బును మార్గదర్శి తనవద్దే ఉంచుకుంటోందని ఏపీ సిఐడి ఆరోపించింది.

Update: 2023-06-20 17:28 GMT

క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ (MCFPL) కి చెందిన మొత్తం తొమ్మిది శాఖలలో అవకతవకలు జరిగాయని గుర్తించింది. ఉల్లంఘనలను గుర్తించిన శాఖలను మూసివేయనున్నారు. మార్గదర్శి చిట్ ఫండ్స్‌పై మార్చి 10న కేసు దర్యాప్తు చేపట్టామని.. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 7 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామన్నారు ఏపీ సీఐడీ అడిషనల్ డిజి సంజయ్ తెలిపారు. ఎంసీఎఫ్‌పీఎల్‌కు చెందిన రూ.1,035 కోట్ల విలువైన చరాస్తులను సీఐడీ అటాచ్ చేసింది. మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ను హైదరాబాద్‌లో ఆగస్టు 31, 1962న స్థాపించారు. నాలుగు రాష్ట్రాలలో మొత్తం 108 శాఖలను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో శాఖలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం శాఖల సంఖ్య 37 కాగా 2,351 చిట్ గ్రూపులు ఉన్నాయి 1.04 లక్షల మంది చందాదారులు ఉన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో వార్షిక టర్నోవర్ రూ. 9,677 కోట్లుగా ఉంది. ఏపీలోనే అతిపెద్ద చిట్‍ఫండ్ స్కాంను నిరోధించే ప్రయత్నం చేస్తున్నట్లు ఏపీ సీఐడీ అడిషనల్ డిజి సంజయ్ తెలిపారు. 1982 చిట్‍ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా డిపాజిట్లు సేకరించిన చరిత్ర మార్గదర్శికి సంస్థకు ఉందని మార్గదర్శి చిట్‍ఫండ్ నిధులను ఇతర కంపెనీలకు మళ్లించడంతో సహా పెద్ద ఎత్తున నగదు రూపంలో డబ్బు తరలిస్తున్నారని సంజయ్ చెప్పుకొచ్చారు.

ప్రజలకు ఎక్కువ వడ్డీ ఇస్తామనే ఆశ చూపి చందాదారుల డబ్బును మార్గదర్శి తనవద్దే ఉంచుకుంటోందని ఏపీ సిఐడి ఆరోపించింది. మార్గదర్శి కేసులో A1 రామోజీరావు, A2 శైలజా కిరణ్ ఏ3, ఏ4గా మార్గదర్శి ఫోర్మెన్‌, ఏ5గా ప్రిన్సిపల్‌ ఆడిటర్‌ కె.శ్రవణ్‌కుమార్‌ నిందితులు చేర్చినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఐదుగురు నిందితులను విచారించినా.. వారు సహకరించట్లేదన్నారు. చిట్‍ఫండ్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఖాతాలను నిర్వహించడంతో పాటు, బ్యాలెన్స్ షీట్ దాఖలు చేయట్లేదని సంజయ్ తెలిపారు. మార్గదర్శి చిట్‍ఫండ్స్‍పై ఇప్పటి వరకు 7 FIRలు నమోదు చేశామని తెలిపారు. చిట్ ఫండ్ చట్టం, 1982 ప్రకారం మార్గదర్శి గ్రూప్ బ్యాలెన్స్ షీట్ లను దాఖలు చేయలేదు. ఎన్నో అవకతవకలు గుర్తించామని అన్నారు. విచారణ సమయంలో, మనీలాండరింగ్, నిధులను స్వాహా చేయడం, కార్పొరేట్ మోసాలు, బినామీ లావాదేవీలు బయటపడ్డాయని అన్నారు. ఒక గ్రూపు నుంచి వచ్చిన చిట్ ఫండ్ సొమ్మును మరో గ్రూపునకు మళ్లించినట్లు విచారణలో తేలింది. మొత్తం నిధులు ప్రధాన కార్యాలయం ఉన్న హైదరాబాద్‌కు బదిలీ చేశారన్నారు. వేలాది మంది తొలగించిన చందాదారుల పేర్లను తిరిగి నమోదు చేస్తున్నారని సంజయ్ తెలిపారు. కొత్త చిట్ వ్యాపారాన్ని నిలిపివేయాలని తాము ఆదేశాలు జారీ చేయలేదని, అయితే చిట్ ఫండ్ చట్టం, 1982 ప్రకారం బ్యాలెన్స్ షీట్ దాఖలు చేయాలని, నిబంధనలను అనుసరించాలని కోరామని చెప్పారు. మార్గదర్శి అనుసరించిన ఉల్లంఘనలు, మోసపూరిత పద్ధతులు సత్యం కంప్యూటర్స్, సహారా, శారదా చిట్స్ మోసంతో సారూప్యతను కలిగి ఉన్నాయని సంజయ్ అన్నారు.


Tags:    

Similar News