Andhra Pradesh : వాహనదారుల జేబులకు చిల్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహనదారులకు షాక్ ఇచ్చింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహనదారులకు షాక్ ఇచ్చింది. ఇకపై కొత్తగా వాహనాలు కొనుగోలు చేస్తే పది శాతం పన్ను విధించింది. రహదారి ప్రమాదాల నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మోటారు వాహన పన్ను సవరణ బిల్లును మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రవేశపెట్టారు. రోడ్ సేఫ్టీకి ప్రత్యేక నిధి, రహదారి భద్రతకు శాతం సెస్సును అదనంగా రాష్ట్ర ప్రభుత్వం విధించనుంది. దీంతో వాహనాల ధరలు మరింత పెరగనున్నాయి.
రహదారి సెస్సు పేరిట
రాష్ట్రంలో రహదారి ప్రమాదాలను తగ్గించి భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనముల పన్ను విధింపు (సవరణ) బిల్లు, 2026ను రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రిజిస్ట్రేషన్ సమయంలో జీవితకాల పన్ను చెల్లించే వాహనాలపై 10 శాతం రహదారి భద్రతా సెస్సు విధించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నిధులను రహదారి భద్రతా మౌలిక సదుపాయాల అభివృద్ధి, బ్లాక్స్పాట్స్ మెరుగుదల, ప్రమాదాల తగ్గింపుకు వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సెస్సుతో రాష్ట్రానికి నెలకు సుమారు రూ.22.5 కోట్లు, సంవత్సరానికి రూ.270 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు.