చిల్లీ టూరిజం: ఆనంద్ మహీంద్రా సూచన

నారాలోకేష్ X లో పోస్ట్ చేసిన ఎండు మిర్చి పొలాల వీడియో తో ఆనంద్ మహీంద్రా సూచన. రైతుల ఆదాయం పెంచేందుకు బెలూన్ రైడ్‌లు, ఉత్సవాలు నిర్వహహించచు.ప్రతిపాదనను పరిశీలిస్తామని నారా లోకేష్ స్పందన

Update: 2026-03-05 06:16 GMT

గుంటూరు: గుంటూరు జిల్లాలో ఎండబెట్టిన ఎర్ర మిరపకాయలు విస్తరించిన పొలాల దృశ్యాలను పర్యాటక ఆకర్షణగా మార్చాలని పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సూచించారు. మిరప పంటను పొలాల్లో ఎండబెట్టిన దృశ్యాలతో ఉన్న వైమానిక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆయన ఈ ప్రతిపాదన చేశారు.

మార్చి 4న ఎక్స్‌లో పోస్ట్ చేసిన మహీంద్రా, పొలాలపై ఎర్ర మిరపకాయలు పరచిన దృశ్యాన్ని “అద్భుతమైన రంగుల చీరలా కనిపిస్తోంది” అని వ్యాఖ్యానించారు. ఆ రంగులు హోలీ పండుగకు సరిపోయేలా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

గుంటూరు జిల్లా దేశంలో మిరప ఉత్పత్తిలో కీలక ప్రాంతమని, భారతదేశ మొత్తం మిరప ఉత్పత్తిలో సుమారు 15 శాతం ఇక్కడి నుంచే వస్తుందని ఆయన గుర్తుచేశారు.

శీతాకాలంలో ‘చిల్లీ టూరిజం’ ఆలోచన

శీతాకాల పంట కోత సమయంలో పొలాల్లో మిరపకాయలను ఎండబెడతారని మహీంద్రా చెప్పారు. ఆ కాలంలో పర్యాటక కార్యక్రమాలు నిర్వహించే అవకాశాన్ని రాష్ట్రం పరిశీలించవచ్చని సూచించారు.

“నేను అక్కడికి వెళ్లలేదు. కానీ నేలమట్టంలో నిలబడి చూస్తే ఆ నమూనాల అందం పూర్తిగా కనిపించకపోవచ్చు” అని ఆయన పేర్కొన్నారు. పర్యాటకులు, పై నుంచి చూడటానికి హాట్ ఎయిర్ బెలూన్ రైడ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.

పంట కోత సందర్భంగా స్థానిక సంగీతం, నృత్యాలతో ఉత్సవాలు నిర్వహిస్తే సందర్శకులను ఆకర్షించవచ్చని చెప్పారు.

ఇలాంటి కార్యక్రమాలు రైతులు, స్థానిక ప్రజలకు అదనపు ఆదాయం అందించే అవకాశముందని ఆయన అన్నారు. అయితే పర్యాటకం వల్ల వ్యవసాయ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుందనే అభిప్రాయం కొందరిలో ఉండవచ్చని కూడా పేర్కొన్నారు.

ప్రభుత్వ స్పందన.. మిశ్రమ అభిప్రాయాలు

ఈ పోస్ట్‌కు స్పందించిన మంత్రి నారా లోకేష్, ఈ ఆలోచనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు.

సోషల్ మీడియాలో ఈ ప్రతిపాదనపై మిశ్రమ స్పందనలు వచ్చాయి. గుంటూరు మిరప ఉత్సవం నిర్వహిస్తే ప్రాంతానికి గుర్తింపు పెరిగి పర్యాటకులను ఆకర్షిస్తుందని కొందరు అభిప్రాయపడ్డారు.

అయితే మరోవైపు రైతుల సమస్యలు, ధరల మార్పులు ఇంకా కొనసాగుతున్నాయని మరికొందరు గుర్తుచేశారు. గత మార్కెటింగ్ సీజన్‌లో తక్కువ ధరలతో పలువురు మిరప రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని వారు ప్రస్తావించారు.

Tags:    

Similar News