కరెంట్ కష్టాలే.. ఎన్టీపీసీ సింహాద్రిలో నిలిచిపోయిన విద్యుదుత్పత్తి

విశాఖపట్టణం సమీపంలోని ఎన్టీపీసీ సింహాద్రిలోని 4 యూనిట్లలో ఒకేసారి విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఉదయం 3 గంటల నుంచి 2 వేల మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది.

Update: 2022-05-03 05:01 GMT

విశాఖపట్టణం సమీపంలోని ఎన్టీపీసీ సింహాద్రిలోని 4 యూనిట్లలో ఒకేసారి విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఉదయం 3 గంటల నుంచి 2 వేల మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. ఎన్టీపీసీ పరిసరాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి. అధికారులు విద్యుదుత్పత్తిని పునరుద్ధరించే చర్యలు చేపట్టారు. గ్రిడ్‌ నుంచి కూడా ఎన్టీపీసీ సింహాద్రికి విద్యుత్ సరఫరా కావడం లేదు. ఇక గత అర్ధరాత్రి నుంచి పరవాడ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తూ ఉంది. ఒకేసారి నాలుగు యూనిట్లలో విద్యుదుత్పత్తి ఎప్పుడూ నిలిచిపోలేదని అధికారులు తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు అవసరమైన కలపాల 400 కేవీ విద్యుత్ స్టేషన్‌కు గ్రిడ్ నుంచి సరఫరా నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. దాదాపు రెండున్నర గంటలు శ్రమించిన అధికారులు గ్రిడ్ నుంచి ఎన్టీపీసీ సింహాద్రికి విద్యుత్‌ను పునరుద్ధరించి పాక్షికంగా సరఫరా చేస్తున్నారు.


ఏకంగా 2,000 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోవడంతో ఎన్టీపీసీ పరిసర ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లాయి. మంగళవారం ఉదయం 3 గంటల నుంచే విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. వెంటనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం అత్యవసర మరమ్మతు పనుల్లో నిమగ్నమైంది. ఈ అంతరాయం కారణంగా ఇక్కడి నుంచి ఇతర సబ్ స్టేషన్లకు చేరాల్సిన విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గ్రిడ్ నుంచి ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా ఉమ్మడి విశాఖ జిల్లాకు విద్యుత్ సరఫరా జరుగుతుంది. అయితే మంగళవారం ఉదయం కలిగిన తీవ్ర అంతరాయం కారణంగా ఉమ్మడి విశాఖ జిల్లాలోని కలపాక 400కేవీ సబ్ స్టేషన్‌కు సరఫరా ఆగిపోయింది.


Tags:    

Similar News