మొత్తానికి తెలంగాణలో నామినేటెడ్ పదవుల పంపకం షురూ అయింది. దాదాపు ఏడాదికి పైగా ఇదిగో అదిగో అంటూ నామినేటెడ్ పదవుల పంపకం గురించి ఊరిస్తూ వస్తున్న ముఖ్య మంత్రి కేసీఆర్ దసరా కానుకగా పార్టీ నాయకులకు పదవులు పంచేశారు. ఒకేసారి రాష్ట్రంలోని 9 కీలక కార్పొరేషన్లకు ఆయన ఛైర్మన్లను ప్రకటించారు.
వీరిలో..
టీఎస్ ఆగ్రో ఛైర్మన్గా కృష్ణారావు
సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఛైర్మన్గా సుదర్శన్ రెడ్డి
టీఎస్ఐఐసీ ఛైర్మన్గా బాలమల్లు
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్గా వెంకటేశ్వర్ రెడ్డి
ఇరిగేషన్ డెవలప్మెంట్ కమిటీ ఛైర్మన్గా ఈద శంకర్ రెడ్డి
గొర్రెలు మేకల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్గా రాజయ్య
కుడా ఛైర్మన్ గా మర్రి యాదవరెడ్డి
ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా బండనరేందర్ రెడ్డి
వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్గా శామ్యూల్
అలాగే ఈ నామినేటెడ్ పదవుల పంపకంతో పాటు ఖమ్మంను పోలీసు కమిషనరేట్గా మార్చడానికి కూడా సీఎం కేసీఆర్ అంగీకారం తెలిపారు.
నిజానికి నియోజకవర్గ స్థాయి వరకు కీలక కార్యకర్తలందరికీ కూడా నామినేటెడ్ పదవుల పంపకం ఉంటుదంటూ.. గత ఏడాది ప్లీనరీ జరిగినప్పటినుంచి కేసీఆర్ చెబుతూ వస్తున్నారు. కాకపోతే.. అది ఇన్నాళ్లకు సాకారం అయింది. ఇంకా అనేక కార్పొరేషన్లు, ఇతరత్రా నామినేటెడ్ పదవులు ఖాళీ ఉండడంతో.. దసరా గడచిపోతున్నది గనుక.. దీపావళి కానుకగా అయినా ఆ పోస్టులను దక్కించుకోవడానికి తతిమ్మా నాయకులు తొందరపడడం కూడా మొదలయింది .