IAS : ఐఏఎస్ లూ పారా హుషార్.. వచ్చే నెల 31వ తేదీ వరకే గడువు
ఐఏఎస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం గట్టి హెచ్చరిక జారీ చేసింది.
ఐఏఎస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం గట్టి హెచ్చరిక జారీ చేసింది. నిర్దేశిత గడువులోగా తమ ఆస్తుల వివరాలను వెల్లడించకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేసింది. అవసరమైతే పదోన్నతులను కూడా నిలిపివేస్తామని పేర్కొంది. ఐఏఎస్ అధికారులు తమ వార్షిక స్థిరాస్తి వివరాలను 2026 జనవరి 31 లోగా తప్పనిసరిగా దాఖలు చేయాలని ఆదేశించింది. గడువు దాటితే ప్రమోషన్లపై ప్రభావం ఉంటుందని తెలిపింది. లేకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దేశ వ్యాప్తంగా ఐఏఎస్ ల పనితీరుపై అనుమానాలు వస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తమ ఆస్తుల వివరాలను ఎప్పికప్పుడు తెలియజేయాలని ఉత్వర్వులు జారీ చేసింది.
2024 సంవత్సరానికి సంబంధించి...
కేంద్ర సిబ్బంది ,శిక్షణ శాఖ దేశంలోని ఐఏఎస్ అధికారులందరికీ కీలక ఆదేశాలు జారీ చేసింది. 2024 సంవత్సరానికి సంబంధించిన స్థిరాస్తి రిటర్నులను వచ్చే ఏడాది జనవరి 31 లోపు సమర్పించాలని స్పష్టం చేసింది. అధికారుల ఆస్తుల వివరాల్లో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా ఈ ప్రక్రియను చేపడుతుంది. నిర్ణీత గడువులోపు ఆస్తుల వివరాలు ఇవ్వని పక్షంలో, సదరు అధికారులపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది.నిబంధనల ప్రకారం గడువు లోపు ఆస్తుల వివరాలు సమర్పించని అధికారులకు ప్రమోషన్లు, విదేశీ పోస్టింగ్ల విషయంలో అడ్డంకులు ఎదురవుతాయి. అంతేకాకుండా, వారికి ప్రభుత్వం నుంచి అందే విజిలెన్స్ క్లియరెన్స్ నిలిపివేస్తారు.
తప్పుడు సమాచారం ఇస్తే...
ఆస్తుల వివరాలు దాచడం లేదా తప్పుడు సమాచారం ఇవ్వడం ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారం క్రమశిక్షణా ఉల్లంఘన. ఒక అధికారి సర్వీసులో చేరినప్పుడు ఉన్న ఆస్తులకు, సర్వీసులో ఉండగా సమకూరిన ఆస్తులకు మధ్య వ్యత్యాసాన్ని దీని ద్వారా పర్యవేక్షించవచ్చు. ఇది అవినీతిని అరికట్టడానికి ఒక శక్తివంతమైన సాధనంగా పనిచేస్తుంది. ఆస్తుల వివరాలను ఆన్లైన్ పోర్టల్ స్పారో ద్వారా బహిరంగ పరచడం వల్ల సామాన్యులకు కూడా సమాచార హక్కు చట్టం కింద లేదా నేరుగా అధికారుల ఆస్తులను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది అధికారుల ప్రవర్తనను పరోక్షంగా నియంత్రిస్తుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో దర్యాప్తు సంస్థలకు ఈ డేటా కీలకమైన ఆధారంగా మారుతుంది.
సివిల్ సర్వీస్ అధికారులందరికీ...
అందుకే ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. సివిల్ సర్వీస్ అధికారులందరికీ వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కేంద్రం జారీ చేసిన ఈ ఆదేశాలు కేవలం ఐఏఎస్ అధికారులకే పరిమితం కాకుండా, ఐపీఎస్ , ఐఎఫ్ఎస్ అధికారులకు కూడా వర్తిస్తాయి. ఈ ఏడాది ఆస్తుల వెల్లడి ప్రక్రియను మరింత కఠినతరం చేయడం ద్వారా, ఉన్నతాధికారుల్లో బాధ్యతాయుతమైన ప్రవర్తనను తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. డిజిటల్ విధానంలో ఈ వివరాల సేకరణ జరుగుతుండటంతో, డేటా విశ్లేషణ కూడా సులభం కానుంది. చాలా మంది అధికారులు తమ పేరుతో.. తమ కుటుంబసభ్యుల పేర్లతో విచ్చలవిడిగా ఆస్తులు పోగేసుకున్నారు. అందుకే వివరాలివ్వడానికి చాలా మంది వెనుకడుగు వేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో సివిల్ సర్వీస్ అధికారులు తమ ఆస్తులను వివరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.