గుజరాత్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో సంబరాలు చేసుకుంటోన్న బీజేపీ త్వరలోనే మరో మూడు లోక్సభ స్థానాల ఉప ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖరారు కావడంతో ఇప్పుడు బీజేపీ ముందు కర్ణాటక ఎన్నికలే ఉన్నాయి. వచ్చే యేడాది ఆరంభంలో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ప్రధానంగా ఇక్కడే టార్గెట్ చేయనుంది.
మరో మూడు లోక్ సభ ఎన్నికలు...
బీజేపీ కర్ణాటక ఎన్నికలతో పాటు మరో మూడు లోక్సభ స్థానాల్లో ఉప ఎన్నికలకు కూడా రెడీ కావాల్సి ఉంది. బీజేపీకి చెందిన ముగ్గురు ఎంపీల రాజీనామాను లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సోమవారం ఆమోదించారు. బీజేపీకి చెందిన ఆదిత్యానాథ్ యూపీ సీఎం ఎంపిక కావటంతో ఆయన ఘోరక్పూర్ ఎంపీ స్థానానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అలాగే యూపీకే చెందిన మరో ఎంపీ కేశవ్ ప్రసాద్ మౌర్య యూపీ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో యూపీలోని పుల్పూర్ ఎంపీగా ఉన్న ఆయన కూడా తన ఎంపీ పదవిని వదులుకున్నారు. ఇక మహారాష్ట్రకు చెందిన నానా పటోలే పార్టీపై అసంతృప్తితో ఈ మధ్యే తన పదవికి రాజీనామా చేయటం తెలిసిందే. ఈ క్రమంలో వారి వారి రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఈ మూడు ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.