బాబు స్ట్రాటజీ మార్చారు... హోప్స్ పెరిగాయట

టీడీపీ జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. ప్రజల్లో ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు రెడీ అయిపోయింది

Update: 2022-06-18 04:05 GMT

తెలుగుదేశం పార్టీ జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. ఇటు కార్యకర్తలను ఉత్సాహపర్చడంతో పాటు ప్రజల్లో ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు రెడీ అయిపోయింది. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. నెలలో మూడు రోజుల పాటు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉత్తరాంధ్రలో జరిగిని మినీ మహానాడుకు కూడా స్పందన బాగా రావడంతో ఉత్సాహం ఆ పార్టీ నేతల్లో మరింత రెట్టింపయింది.

ఉత్తరాంధ్రలో....
రాయలసీమ కంటే ఉత్తరాంధ్రను చంద్రబాబు మొదట ఎంచుకున్నారు. రాయలసీమలో కొంత పార్టీకి నష్టం జరిగినా ఉత్తరాంధ్రలో ఈసారి పూర్తి స్థాయిలో మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలని చంద్రబాబు ప్రయత్నం మొదలుపెట్టారు. అందుకే తన జిల్లాల పర్యటనను అనకాపల్లి జిల్లా నుంచి ప్రారంభించారు. గత ఎన్నికల్లో పాత ఉత్తరాంధ్ర జిల్లాల్లోని విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో కేవలం ఆరు అసెంబ్లీ స్థానాలను మాత్రమే గెలచుకుంది. విజయనగరం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి పూర్తి స్థాయి పట్టు సాధించేేందుకు చంద్రబాబు ఉత్తరాంద్రను టార్గెట్ చేసినట్లు కనపడుతుంది.
రాయలసీమలో....
రాయలసీమలోని నాలుగు జిల్లాల్లోనూ గత ఎన్నికల్లో మూడు స్థానాలు మాత్రమే దక్కాయి. అయితే పార్టీకి హోప్ ఉన్న ఉత్తరాంధ్రతో బలోపేతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. 35 నియోజకవర్గాలున్న ఉత్తరాంధ్ర ఎప్పుడూ టీడీపీకి కంచుకోట. పార్టీ అధికారంలోకి రాకపోయిన సమయంలోనూ ఇక్కడ ఎక్కువ స్థానాలు వచ్చిన సందర్భాలున్నాయి. అలాంటి ఉత్తరాంధ్రపైనే చంద్రబాబు ఆశలు పెట్టుకున్నారు. కోస్తాంధ్రలో ఈసారి ఎటూ వైసీపీ కంటే పై చేయి సాధిస్తామన్న నమ్మకంతో ఉన్న చంద్రబాబు తొలుత ఉత్తరాంధ్రలో పార్టీ క్యాడర్ ను ఉత్తేజం చేయడంతో పాటు పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు.
పార్టీని వీడిన నేతలను...
దీంతో పాటు పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలను పార్టీలోకి తీసుకునేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. సామాజికవర్గాల వారీగా నేతల పేర్లను పరిశీలిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును తిరిగి పార్టీలోకి తీసుకోవాలని నిర్ణయించారని తెలిసింది. అలాగే మరికొందరి పేర్లను కూడా ఆయన పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పట్టుదలకు పోకుండా ఆర్థికంగా, సామాజికవర్గంగా బలమైన నేతలను తిరిగి పార్టీలోకి తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ఉత్తరాంధ్రలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ నేతల విషయంలో ఇదే స్ట్రాటజీని చంద్రబాబు అనసరిస్తారంటున్నారు.


Tags:    

Similar News