ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం - డీజీపీకి చంద్రబాబు లేఖ

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. విగ్రహాలపై దాడులు

Update: 2022-01-03 09:58 GMT

గుంటూరు జిల్లా దుర్గిలో దివంగత సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను టీడీపీ, బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. తాజాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. విగ్రహాలపై దాడులు ప్రణాళికాబద్దంగానే జరుగుతున్నాయని, మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే.. పోలీసులు అలసత్వం ప్రదర్శించడం తగదని ఆ లేఖలో పేర్కొన్నారు. వివిధ వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలో భాగంగానే వైకాపా జడ్పీటీసీ సెట్టిపల్లి యలమంద ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు.

" ఈ తరహా ఘటనలు పునరావృతమైతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. అధికార వైకాపా నాయకుల అండదండలతోనే ఇటువంటి సంఘటనలు రాష్ట్రంలో జూన్ 2019 నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే ప్రయత్నంలో అధికార పార్టీ గూండాలను ప్రోత్సహిస్తూ ఎన్టీఆర్, అంబేద్కర్ వంటి జాతీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు" అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి విధ్వంసాలకు పాల్పడే నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారన్న అభిప్రాయం సర్వతా వ్యక్తమవుతోందన్నారు. ఇకనైనా పోలీసులు మేల్కొని ఇలాంటి విధ్వంసక చర్యలను అడ్డుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.


Tags:    

Similar News