సజ్జనార్ సరికొత్త నిర్ణయం

తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలను స్వీకరించిన తర్వాత కొత్త ఆలోచనలతో బస్సును పరుగులు పెట్టిస్తున్నారు

Update: 2023-04-24 04:11 GMT

తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలను స్వీకరించిన తర్వాత కొత్త ఆలోచనలతో బస్సును పరుగులు పెట్టిస్తున్నారు. విన్నూత్న ఆలోచనలతో ఆయన అడుగులు వేస్తున్నారు. పోలీసు అధికారి అయిన ఆయన ప్రజాకోణంలో ఆలోచించి ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిచ్చాయి. ఆర్టీసీ సంస్థ తమ కాళ్ల మీద తాము నిలబడేటట్లు చేయాలన్నది ఆయన యత్నం. అది భగీరథ ప్రయత్నమే అని తెలిసినా సజ్జనార్ మాత్రం తన ఆలోచనలకు ఫుల్‌స్టాప్ పెట్టలేదు. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. ప్రజల ఆదరణ పొందితేనే ఆర్టీసీకి మనుగడ సాధ్యమవుతుందని భావించిన సజ్జనార్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

విలేజ్ బస్ ఆఫీసర్లు...
తాజాగా సజ్జనార్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ప్రజా రవాణా వ్యవస్థను ప్రజల ముంగిటకు తీసుకెళ్లేందుకు ఆర్టీసీలో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలను తమ వైపునకు తిప్పుకునేందుకు తెలంగాణలోని గ్రామాల్లో బస్‌ ఆఫీసర్లను నియమించాలని నిర్ణయించారు. విలేజ్‌ బస్‌ ఆఫీసర్ల నియామకం, వారి విధి విధానాలకు సంబంధించిన మార్గదర్శకాలను టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఐపీఎస్‌ ఇప్పటికే జారీ చేశారు. బస్‌ ఆఫీసర్లను వీలైనంత త్వరగా నియమించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ బస్‌ ఆఫీసర్ల వ్యవస్థ మే ఒకటో తేది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వస్తుందని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
మార్గదర్శకాలివే....
తెలంగాణలోని అన్ని గ్రామాల్లో నివాసించే సంస్థ కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర ఉద్యోగులను విలేజ్‌ బస్‌ ఆఫీసర్లగా డిపో మేనేజర్లుగా నియమిస్తారు. నియామకాల్లో ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలుండి.. స్వచ్ఛందంగా పనిచేసేందుకు ముందుకువచ్చే వారికి ప్రాధాన్యం ఇస్తారు. పెద్ద గ్రామానికి ఒకరు బస్‌ ఆఫీసర్‌గా ఉంటారు. చిన్నవైతే రెండు, మూడు గ్రామాలకు ఒకరిని నియమిస్తారు. ఈ మార్గదర్శకాల ప్రకారం.. ఒక్కరికి 5 గ్రామాల కంటే ఎక్కువగా కేటాయించడానికి వీలులేదు. హైదరాబాద్‌ సహా అన్ని మున్సిపాలిటీల్లోనూ వార్డుకో బస్‌ ఆఫీసర్‌ను డిపో మేనేజర్లు నియమిస్తారు. వారు ఆయా వార్డుల పరిధిలో విలేజ్‌ బస్‌ ఆఫీసర్లలాగే పనిచేస్తారు. ఈ విలేజ్‌ బస్‌ ఆఫీసర్లు గ్రామస్థులతో నిత్యం టచ్‌లో ఉంటారు.
పదిహేనురోజులకు...
బస్‌ అధికారులు పదిహేను రోజులకోసారి గ్రామస్తులతో సమావేశమవుతారు. బస్సుల రాకపోకలు, సమయాలు, కొత్త రూట్‌లు, కొత్త సర్వీస్‌లు, సమస్యలు, తదితర అంశాల గురించి సమాచారాన్ని సేకరిస్తారు. ఆ సమాచారాన్ని పై అధికారులకు చేరవేస్తారు. గ్రామాల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు, జాతరల వివరాలను వారు సేకరిస్తారు. రద్దీ ఎక్కువగా ఉంటే అందుకు తగ్గట్టుగా బస్‌ ట్రిప్పులను పెంచుతారు. అలాగే పెళ్లిళ్లు, శుభకార్యాలకు తమ అద్దె బస్సులను ఉపయోగించుకోవాలని వివరిస్తారు. ప్రైవేట్‌ వాహనాల్లో వెళ్తే జరిగే అనర్థాలను ప్రజలకు చెప్తారు. గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, సంఘాల నాయకులు, డ్వాక్రా గ్రూప్‌ సభ్యులతో పాటు పంక్షన్‌ హాల్స్‌ నిర్వాహకులను బస్‌ ఆఫీసర్లు సంప్రదిస్తారు. వారికి తమ సెల్‌ఫోన్‌ నంబర్లను అందజేస్తారు.
రవాణా వ్యవస్థ మెరుగుపర్చడంతో పాటు...
ప్రజా రవాణా వ్యవస్థతో పాటు టీఎస్‌ఆర్టీసీ కార్యక్రమాలను వివరిస్తారు.ప్రతి గ్రామపంచాయతీ కార్యాలయంలోని నోటీస్‌ బోర్డులో సంబంధిత విలేజ్‌ బస్‌ ఆఫీసర్‌ వివరాలను స్థానిక డిపో మేనేజర్‌ పొందుపరుస్తారు. అందులో బస్‌ ఆఫీసర్‌ పేరు, ఫోన్‌ నంబర్‌ ఉంటుంది. ''మీ గ్రామానికి వచ్చే బస్సులకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులు, రాయితీ పథకాలతో పాటు పెళ్లిళ్లు, శుభకార్యాలకు బస్సులను అద్దెకు పొందేందుకు విలేజ్‌ బస్‌ ఆఫీసర్‌ను సంప్రదించండి." అని పేర్కొంటారు. అంతేకాదు, ప్రతి గ్రామ సర్పంచ్‌కు తమ విలేజ్‌ బస్‌ ఆఫీసర్‌ వివరాలను లేఖ రాస్తారు. ఆ ఆఫీసర్‌ సేవలను వినియోగించుకోవాలని కోరుతారు. మంచిగా పనిచేసే విలేజ్‌ బస్‌ ఆఫీసర్లను ప్రోత్సహించాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. ప్రతి మూడు నెలలకోసారి పనితీరు మంచిగా ఉన్న వారిని బెస్ట్‌ విలేజ్‌ బస్‌ ఆఫీసర్‌ అవార్డుతో సత్కరించనుంది. ఈ విధానం వల్ల అందరూ మంచిగా పనిచేసే అవకాశముంది.





Tags:    

Similar News