పీకే + పీఆర్ వెరసి కేసీఆర్.. ఇద్దరి పర్యటన?

మల్లన్న సాగర్ ప్రాజెక్టును ప్రశాంత్ కిషోర్, ప్రకాష్ రాజ్ పరిశీలించారు. మల్లన్నసాగర్ నిర్వాసితులతో వీరిద్దరూ మాట్లాడారు

Update: 2022-02-27 08:01 GMT

మల్లన్న సాగర్ ప్రాజెక్టును ప్రశాంత్ కిషోర్, ప్రకాష్ రాజ్ పరిశీలించారు. మల్లన్నసాగర్ నిర్వాసితులతో వీరిద్దరూ మాట్లాడారు. ప్రశాంత్ కిషోర్ తో కలిసి ప్రకాష్ రాజ్ తెలంగాణలో పర్యటించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ టీం ను వచ్చే ఎన్నికలకు వ్యూహకర్తగా నియమించుకున్నారు. ప్రశాంత్ కిషోర్ నేరుగా తెలంగాణలో పర్యటించడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.

తెరవెనక మాత్రమే....
ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా ఇప్పటి వరకూ తెరవెనుక మాత్రమే పనిచేశారు. ఆయన టీం ఎన్నికలకు సంబంధించి సర్వేలు నిర్వహించడం, బలాబలాలను తెలియజేయడం, నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలను మాత్రమే చూసేది. కానీ నేడు ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో నీటి ప్రాజెక్టులను పర్యటించడం, అక్కడ నిర్వాసితులతో మాట్లాడటం కొత్త పోకడగా కన్పిస్తుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
జాతీయ రాజకీయాల్లో....
కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ రాజకీయాలను ఇటీవల కాలంలో హీటెక్కిస్తున్నారు. బీజేపీ యేతర పక్షాల నేతలను వరసగా కలుస్తున్నారు. దీని వెనక కూడా ప్రశాంత్ కిషోర్ ఉన్నారన్న టాక్ అయితే బలంగా ఉంది. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి బీజేపీ కూటమికి పోటీగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను పోటీ చేయించాలన్న వ్యూహంలో కేసీఆర్ ఉన్నారు. ఇది కూడా ప్రశాంత్ కిషోర్ ఆలోచనే.
తెలంగాణ యాత్ర....
ప్రశాంత్ కిషోర్ తో పాటు సినీనటుడు ప్రకాష్ రాజ్ కూడా తెలంగాణ నీటి ప్రాజెక్టులను పరిశీలించారు. ప్రకాష్ రాజ్ తొలి నుంచి బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఆయన మొన్న కేసీఆర్ ముంబయి పర్యటనలో కూడా పాల్గొన్నారు. ప్రకాష్ రాజ్, ప్రశాంత్ కిషోర్ లు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను మరోసారి గెలిపించడం కోసమే తెలంగాణ యాత్ర చేపట్టినట్లు రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. మొత్తం పీకే, పీఆర్ లు కేసీఆర్ కు మద్దతుగా ఇప్పటి నుంచే పొలిటికల్ గేమ్ మొదలు పెట్టినట్లుంది.


Tags:    

Similar News