కిర‌ణ్ 'రెడ్డి' ఎంట్రీతో జ‌గ‌న్ 'రెడ్డి'కి క‌ష్టాలు త‌ప్ప‌వా ?

కాంగ్రెస్‌కు పెద్ద మైన‌స్ బ‌ల‌మైన నాయ‌కులు లేక‌పోవ‌డం. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆ పార్టీలోని కీల‌క నేత‌లంద‌రూ టీడీపీ, వైసీపీలో

Update: 2022-05-17 06:23 GMT

అమరావతి : ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ చివ‌రి ముఖ్య‌మంత్రి న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి రాజ‌కీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేర‌కు ఆయ‌న ఢిల్లీ వెళ్లారు. అక్క‌డ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో స‌మావేశం కానున్నారు. కాంగ్రెస్ పార్టీ బ‌ల‌హీనంగా ఉన్న రాష్ట్రాల‌పై తాజాగా ఆ పార్టీ అధిష్ఠానం దృష్టి పెట్టింది. ఈ రాష్ట్రాల్లో బ‌ల‌మైన నాయ‌కుల‌కు పార్టీ ప‌గ్గాలు అందించ‌డం ద్వారా మ‌ళ్లీ పూర్వ‌వైభ‌వం తెచ్చుకోవాల‌ని భావిస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఒక‌నాడు త‌మ పార్టీ వెలుగు వెలిగి క‌నుమ‌రుగైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌ళ్లీ బ‌లోపేతం కావాల‌ని చూస్తోంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో నెల‌కొని ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితులు త‌మ‌కు కొంత‌వ‌ర‌కైనా క‌లిసి వ‌స్తాయ‌ని ఆ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగానే కిర‌ణ్ కుమార్ రెడ్డిని ఢిల్లీ పిలిపించారు. ప్ర‌స్తుత పీసీసీ చీఫ్ శైల‌జానాథ్ పద‌వీకాలం ముగిసింది. రాష్ట్రంలో కొత్త పీసీసీ చీఫ్‌ను నియ‌మించాల్సి ఉంది. ఈ ప‌ద‌విని కిర‌ణ్ కుమార్ రెడ్డికి ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన కిర‌ణ్ కుమార్ రెడ్డికి రాష్ట్ర‌వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇది క‌లిసి వ‌స్తుంద‌ని కాంగ్రెస్ పెద్ద‌లు భావిస్తున్నారు. రాష్ట్ర విభ‌జ‌న చేసింద‌నే ఆగ్ర‌హం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల్లో ఇంకా ఉంది. అయితే, 2014తో పోల్చితే ఇప్పుడు కొంత త‌గ్గిందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ప్ర‌స్తుత బీజేపీ కేంద్ర ప్ర‌భుత్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేద‌ని, ఇత‌ర విభ‌జ‌న హామీలు అమ‌లు చేయ‌లేద‌నే అసంతృప్తి కూడా రాష్ట్ర ప్ర‌జ‌ల్లో ఎక్కువ‌గా ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీపైన ఉన్న ఆగ్ర‌హం త‌గ్గ‌డానికి కార‌ణ‌మ‌వుతుంది.

అన్నింటికంటే కాంగ్రెస్‌కు పెద్ద మైన‌స్ బ‌ల‌మైన నాయ‌కులు లేక‌పోవ‌డం. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆ పార్టీలోని కీల‌క నేత‌లంద‌రూ టీడీపీ, వైసీపీలో చేరిపోయారు. కొంద‌రు మాత్ర‌మే కాంగ్రెస్‌లో మిగిలి ఉన్నారు. వారు కూడా సైలెంట్ అయిపోయారు. యాక్టీవ్‌గా రాజ‌కీయాలు చేయ‌డం లేదు. అయితే, కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి మెజారిటీ రెడ్డి నేత‌లు వెళ్లారు. వీరిలో చాలా మంది ఇప్పుడు వైసీపీలో ఉక్క‌పోత‌తో ఉన్నారు. త‌మ‌కు ప్రాధాన్య‌త లేద‌నే అసంతృప్తి వీరిలో చాలా బ‌లంగా ఉంది.

వైసీపీలో రెడ్ల‌కు ఎక్కువ‌గా ప్రాధాన్య‌త ద‌క్క‌డం లేదు. ఐదారు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన నేత‌లు కూడా ఒక‌టి రెండు సార్లు గెలిచి మంత్రి అయిన వారి కింద పని చేయాల్సిన ప‌రిస్థితి ఉంది. ఇది ఆ నేత‌ల‌ను ఇబ్బంది పెడుతోంది. ఒక‌వేళ క‌నుక కిర‌ణ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ అయి మ‌ళ్లీ యాక్టీవ్ అయితే ఇలాంటి వారు ఆయ‌న వెంట న‌డుస్తార‌నే ఆశ‌లు కాంగ్రెస్‌కు ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. గ్రామ‌స్థాయిలో కూడా రెడ్డి సామాజ‌క‌వ‌ర్గంలో క్ర‌మంగా వైసీపీ ప‌ట్ల అసంతృప్తి పెరుగుతోంది.

వైసీపీని త‌మ పార్టీగా భావించి, ఆ పార్టీ గెలుపు కోసం తొమ్మిదేళ్ల పాటు తీవ్రంగా క‌ష్ట‌ప‌డ్డ వారు, ఆస్తులు సైతం పొగొట్టుకున్న రెడ్డి సామాజ‌క‌వ‌ర్గం వారు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారికి ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చినా కూడా ఎలాంటి అవ‌కాశాలు రావ‌డం లేద‌నే అసంతృప్తి ఉంది. వీరు కూడా కిర‌ణ్ కుమార్ రెడ్డి వెంట న‌డిచే అవ‌కాశాలు ఉండొచ్చ‌నే ఆశ‌లు కాంగ్రెస్‌లో ఉన్న‌ట్లున్నాయి. అయితే, కిర‌ణ్ కుమార్ రెడ్డి నిజంగానే పీసీసీ చీఫ్ బాధ్య‌త‌లు తీసుకొని కాంగ్రెస్‌ను ఏపీలో బ‌లోపేతం చేస్తే అది క‌చ్చితంగా వైసీపీకే న‌ష్టం చేసే అవ‌కాశాలు మాత్రం స్ప‌ష్టంగా ఉన్నాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీనే వైసీపీగా మారింద‌ని చెప్పుకోవాలి. కాంగ్రెస్ ఓటు బ్యాంకే వైసీపీ ఓటు బ్యాంకు అయ్యింది. ఇప్పుడు కాంగ్రెస్ ఒక్క ఓటు అద‌నంగా తెచ్చుకున్నా అది వైసీపీకి ప‌డే ఓటు త‌గ్గ‌డ‌మే అవుతుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒక‌వైపు పొత్తుల‌తో టీడీపీ, జ‌న‌సేన క‌లిసి రానున్న నేప‌థ్యంలో కిర‌ణ్ కుమార్ రెడ్డి క‌నుక వైసీపీ ఓట్ల‌ను ఏ మాత్రం చీల్చినా అది వైసీపీకి న‌ష్టం చేసే అవ‌కాశాలు మాత్రం క‌నిపిస్తున్నాయి. మ‌రి, ఏం జ‌రుగుతుందో చూడాలి.


Tags:    

Similar News