తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీకి మరో షాక్... షరతు ఇదే

జేసీ సోదరులిద్దరూ రాజకీయాల నుంచి గత ఎన్నికల నుంచి తప్పుకున్నారు. తమ వారసులకు టిక్కెట్లు ఇప్పించుకున్నారు

Update: 2022-01-03 04:37 GMT

జేసీ సోదరులు రాజకీయంగా కొంత ఒక్క అడుగు వెనక్కు వేసినట్లే కనిపిస్తుంది. గతంలో ఉన్న దూకుడు ఇప్పుడు లేదు. వాళ్లు టీడీపీలోనూ సంతృప్తికరంగా లేరు. వారికి టీడీపీ తప్ప మరో దారి లేదు. అందుకే కష్టంగానైనా టీడీపీలోనైనా కొనసాగేందుకే నిర్ణయించుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై పార్టీ విధించిన ఆంక్షలను వారు జీర్ణించుకోలేెకపోతున్నారు. తమకు బలమున్న నియోజకవర్గాలకు సయితం వెళ్లవద్దంటూ తమను నిరోధించడమేంటన్న ప్రశ్నలు వారి వర్గం నుంచి వెలువడుతున్నాయి.

రాజకీయాల నుంచి...
జేసీ సోదరులిద్దరూ రాజకీయాల నుంచి గత ఎన్నికల నుంచి తప్పుకున్నారు. తమ వారసులకు టిక్కెట్లు ఇప్పించుకున్నారు. కానీ గెలుపు సాధ్యం కాలేదు. అయితే తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో స్వయంగా జేసీ ప్రభాకర్ రెడ్డి రంగంలోకి దిగడంతో ఆయన విజయం సాధించారు. ఇప్పుడు అదే వారి కుటుంబంపై పార్టీ అధినాయకత్వం నుంచి మరో షరతు వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
తిరిగి పోటీ చేయాలని...
తాడిపత్రి నుంచి తిరిగి జేసీ ప్రభాకర్ రెడ్డిని పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. జేసీ అస్మిత్ రెడ్డి కన్నా జేసీ ప్రభాకర్ రెడ్డి అయితేనే వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి పై విజయం సాధిస్తారన్న సర్వే రిపోర్టులను చంద్రాబాబు చూపిస్తున్నారట. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా సర్వే చేసినప్పటికీ జేసీ ప్రభాకర్ రెడ్డినే పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయించారట. ఈసారికి ఆయననే పోటీ చేయించాలని, ఆ తర్వాత అస్మిత్ రెడ్డి రాజకీయ భవిష్యత్ కు తాను అండగా ఉంటానని చంద్రబాబు చెబుతున్నారని తెలిసింది.
పార్లమెంటుకు మాత్రం....
ఇక అనంతపురం పార్లమెంటుకు మాత్రం జేసీ పవన్ కుమార్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జేసీ దివాకర్ రెడ్డి ఇప్పటికే రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు ప్రకటించడం, ఆయన పోటీకి విముఖత చూపుతుండటంతో పవన్ కుమార్ రెడ్డిని బరిలోకి దింపేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. తాడిపత్రిలో మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డికే అవకాశం అని చెబుతున్నారు. మరి ఈ షరతులకు జేసీ కుటుంబం తలొగ్గుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News