డెడ్‌లైన్లతో పవన్‌ పరువు తీసుకుంటున్నారా..?

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మరో డెడ్‌లైన్‌ విధించారు.

Update: 2023-08-17 07:35 GMT

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మరో డెడ్‌లైన్‌ విధించారు. భీముని పట్నం తీరంలోని ఎర్రమట్టి దిబ్బలను బఫర్‌ జోన్‌గా ప్రకటించాలని జగన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 48 గంటల్లో ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, లేకపోతే నేషన్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేస్తానని ప్రభుత్వానికి అల్టిమేటమ్‌ జారీ చేశారు. ఈ 48 గంటల డెడ్‌లైన్‌ వల్ల పవన్‌కి గానీ, జనానికి గానీ ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అంటే లేదనే సమాధానమే వస్తుంది.

పవన్‌ బుధవారం ఎర్రమట్టి దిబ్బలను సందర్శించారు. ఆ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దానికి కౌంటర్‌గా గురువారం సాక్షిలో ఓ కథనాన్ని ప్రచురించారు. ఇప్పటికే ఎర్ర మట్టి దిబ్బల రక్షణ కోసం చర్యలు తీసుకున్నామని, కొంత ప్రాంతాన్ని బఫర్‌ జోన్‌గా విడిచిపెట్టామని ప్రభుత్వం తరఫున ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో పవన్‌ డెడ్‌లైన్‌ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. పవన్‌ ఇంకా సినిమాల ప్రభావం నుంచి బయటకు రావడం లేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సినిమాల్లో కూడా హీరో విలన్‌కు డెడ్‌లైన్‌ విధిస్తాడు. ఆ సమయంలోగా విలన్‌ని ఓడిరచి, తన హీరోయిజాన్ని రుజువు చేసుకుంటాడు. ఇలాంటి డెడ్‌లైన్లు రాజకీయాల్లో పనికిరావు.

గతంలో కూడా పవన్‌ ఇలాంటి డెడ్‌లైన్లే విధించి నవ్వుల పాలయ్యారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లలో ఇసుకకు తీవ్ర కొరత వచ్చింది. అప్పుడు గుంటూరు ప్రాంతాల్లో పర్యటించిన పవన్‌ రెండు వారాల్లో ఇసుక సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ ఇచ్చారు. ఆ తర్వాత ఆ డెడ్‌లైన్‌ ఏమైందో ఎవరికీ తెలీదు. పవన్‌ కూడా దాని గురించి మాట్లాడలేదు. అలాగే స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు మద్దతుగా కూడా పవన్‌ ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధించారు. దానిని కేంద్ర ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు. ఓ డెడ్‌లైన్‌ ఇచ్చిన తర్వాత కనీసం ఓ ఆందోళన కార్యక్రమం నిర్వహించినా ప్రయోజనం ఉంటుంది. అలాంటివేవీ లేకుండా, అభిమానుల చప్పట్ల కోసం డెడ్‌లైన్లు విధిస్తే, తర్వాత నాయకుడి మాటలకు విలువ ఉండదు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పవన్‌ మాటకు కాస్త విలువ ఉండేది. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం కిడ్నీ సమస్యపై పవన్‌ పోరాడారు. ఒక రోజు ఉద్దానం ప్రాంతంలో పర్యటించి అక్కడ కిడ్నీ బాధితులతో మాట్లాడారు. దీనికి స్పందించిన చంద్రబాబు ప్రభుత్వం బాధితులకు నెలకు 2500 రూపాయల పెన్షన్‌ను మంజూరు చేసింది. అక్కడ డయాలసిస్‌ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. ఈ విషయంలో ఉద్దానం వాసులకి పవన్‌ మీద ఇప్పటికీ అభిమానం ఉంది. అయితే జనసేన, వైకాపాల మధ్య ఎలాంటి సామరస్య వాతావరణం లేదు. వ్యక్తిగత విమర్శలు కూడా ఘాటుగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో జగన్‌ వద్ద ఎలాంటి డెడ్‌లైన్లు పెట్టినా ఉపయోగం ఉండదు. దీనివల్ల పవన్‌ జనంలో చులకన అవుతారు. అంతే!

Tags:    

Similar News