Telangna : డబ్బుల కోసం మద్యం తాగించి భర్తను హత్య చేయించి

తెలంగాణలో డబ్బులు కోసం కట్టుకున్న భర్తను కడతేర్చింది ఒక భార్య

Update: 2026-03-09 07:07 GMT

తెలంగాణలో డబ్బులు కోసం కట్టుకున్న భర్తను కడతేర్చింది ఒక భార్య. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. బీమా డబ్బుల కోసం భర్తను చంపి ప్రమాదంగా చిత్రీకరించి లబ్ది పొందాలని ప్రయత్నించింది. అయితే పోలీసులు పసిగట్టి మాయలేడిని అదుపులోకి తీసుకుని విచారించి న్యాయస్థానంలో హాజరు పర్చారు. ఖమ్మంలో సంచలనం సృష్టించిన ఆటో డ్రైవర్ చాగంటి రవిహత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. భర్త అనారోగ్యంతో చనిపోతాడని భావించిన భార్య అతడి పేరుపై రూ.66 లక్షలకు బీమా చేయించింది. ఆ తర్వాత ఆ డబ్బుల కోసం భర్తను దారుణంగా చంపించింది. ఈ కేసులో ఆమెతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

66 లక్షలకు బీమా చేయించి...
పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం నగరానికి చెందిన రవి మద్యానికి బానిసై కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతడి భార్య ప్రశాంతి.. భర్త ఎలాగూ చనిపోతాడనే ఆలోచనతో ఓ పథకం వేసింది. గత ఏడాది జులైలో తన బంధువు శ్రీనివాస్ సహాయంతో రవి పేరు మీద 66 లక్షలకు ఇన్సూరెన్స్ పాలసీ చేయించింది.అయితే, నెలలు గడుస్తున్న కొద్దీ రవి ఆరోగ్యం మెరుగుపడటంతో ప్రశాంతిలో అసహనం పెరిగింది. బీమా డబ్బుల కోసం భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో శ్రీనివాస్‌తో పాటు జోగి రాజ్‌కుమార్, జోగి వెంకటేష్, జోగి రాంబాబులతో ఒప్పందం కుదుర్చుకుంది. హత్య చేస్తే వచ్చే బీమా డబ్బులో సగం ఇస్తానని వారికి ఆశ చూపింది.
పుల్లుగా మద్యం తాగించి...
పథకం ప్రకారం ఈ నెల 2వ తేదీన రవికి ఫుల్లుగా మద్యం తాగించి వీవీ పాలెం శివారు ప్రాంతానికి తీసుకెళ్లారు. అనంతరం కారుతో ఢీకొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. అయితే, ఈ ఘటనపై అనుమానంతో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు, సాంకేతిక ఆధారాల సాయంతో అసలు నిజాన్ని బయటపెట్టారు. ఈ హత్య కేసులో ప్రధాన సూత్రధారి అయిన ప్రశాంతితో పాటు మిగిలిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్సూరెన్స్ డబ్బులు వస్తే తన జీవితం సెటిలవుతుందని భావించిన ఆ ఇల్లాలు ఇప్పుడు కటకటాల వెనక రోజులు గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు, బంధువులు కోరుతున్నారు.


Tags:    

Similar News