జ్ఞానవాపి మసీదు సర్వే పై వారణాసి కోర్టు తీర్పు - అసదుద్దీన్ స్పందన ఇదే..!

కోర్టు ఇచ్చిన తీర్పు ప్రార్థనా స్థలాల చట్టం 1991ని ఉల్లంఘించడమే అవుతుందని తెలిపారు. అంతేకాకుండా బాబ్రీ మసీదు వ్యవహారంలో

Update: 2022-05-13 06:14 GMT

జ్ఞానవాపి మసీదు సర్వేకు అనుకూలంగా వారణాసి కోర్టు తీర్పునివ్వడాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తప్పుపట్టారు. కోర్టు ఇచ్చిన తీర్పు ప్రార్థనా స్థలాల చట్టం 1991ని ఉల్లంఘించడమే అవుతుందని తెలిపారు. అంతేకాకుండా బాబ్రీ మసీదు వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఉల్లంఘించినట్టు అవుతుందని, బాబ్రీ మసీదు తర్వాత మరో మసీదును కోల్పోవడానికి తాము సిద్ధంగా లేమని చెప్పారు. వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, మసీద్ కమిటీలు సుప్రీంకోర్టులో సవాలు చేయాలని ఒవైసీ అన్నారు. మతపరమైన స్థలాల స్వభావాన్ని మార్చాలనుకుంటున్న వ్యక్తులపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కోరారు.

వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం పక్కనే ఈ జ్ఞాన్ వాపి మసీదు ఉంటుంది. ఇది ఒక హిందూ దేవాలయం అంటూ 2021లో ఢిల్లీకి చెందిన ఐదుగురు మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్ వేశారు. మసీదు వెలుపలి గోడపై ఉన్న శ్రీనగర్ గౌరి, గణేశ్, హనుమాన్, నంది విగ్రహాలను ప్రతిరోజు పూజించుకునేందుకు అనుమతించాలని పిటిషన్ లో కోరారు.
అంతకు ముందే సర్వే చేయాలని ప్రయత్నించగా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. జ్ఞానవాపి మసీదులో సర్వే, వీడియోగ్రఫీని నిర్వహించేందుకు నియమించిన అడ్వొకేట్‌ కమిషనర్‌ను తొలగించాలన్న విజ్ఞప్తిని వారణాసి కోర్టు తోసిపుచ్చింది. జ్ఞానవాపి– శ్రీంగార్‌ గౌరీ కాంప్లెక్స్‌లో సర్వేను పదిరోజుల్లో ముగించాలని ఆదేశించింది. ఈ పని కోసం ఇప్పటికే నియమించిన అడ్వొకేట్‌ కమిషనర్‌కు సాయంగా మరో ఇద్దరు లాయర్లను జిల్లా కోర్టు నియమించింది. ఈ ప్రక్రియను ఎవరు అడ్డుకున్నా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. మసీదులో వీడియో సర్వే నిర్వహించాలని కోర్టు తీర్పును వెలువరించింది. మే 17లోగా సర్వేను తమకు అందించాలని ఆదేశించింది. మసీదుకు చెందిన రెండు బేస్‌మెంట్లకు తాళాలున్నాయని మసీదు మేనేజ్‌మెంట్‌ కోర్టుకు తెలియజేసింది. వీటిలో వీడియో తీయడానికి అభ్యంతరం చెప్పింది. అయితే తాళాలు లేకపోతే పగలకొట్టి సర్వే పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది.


Tags:    

Similar News