Weather : ఈసారి సమ్మర్ ఎంతకాలమో తెలిస్తే.. మీరు నోరెళ్లబెడతారంతే?
రెండు తెలుగు రాష్ట్రాల్లో శీతాకాలం ముగిసింది. వేసవి కాలం మొదలయింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో శీతాకాలం ముగిసింది. వేసవి కాలం మొదలయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఎండలు, ఉక్కపోతలు మొదలయ్యాయి. ఇక రాష్ట్రంలో కొన్ని రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలు అలాగే రాత్రి ఉష్ణోగ్రతలు 17- 19 డిగ్రీలు ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. క్రమంగా ఉష్ణోగ్రతల్లో భారీ పెరుగుదల ఉంటుందని వివరిస్తున్నారు. అలాగే ఫిబ్రవరి 25వ తేదీ నుంచి 28వ తేదీ మధ్య ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేస్తున్నారు.
ఎండాకాలంలోనూ...
తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా ప్రకారం.. రాష్ట్రంలో ఎండాకాలంలో కూడా వర్షాలు కురుస్తాయని సమాచారం. వేసవి ప్రథమార్థంలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ లో ఎండలతో పాటు వర్షాలు కూడా ఉంటాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తన ఎక్స్ వేదికగా తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో ఎండాకాలంలో వర్షాలు ఉంటాయని వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత పెరగడమే కాకుండా అక్కడక్కడా వర్షాలు కూడా మొదలవువుతాయి. ఈ మేరకు 3 నెలలపాటు వర్షాలుంటాయని... తర్వాత అసలైన ఎండాకాలం మొదలవుతుందని హెచ్చరిస్తున్నారు. మే, జూన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఎండలు మండిపోతాయని వెదర్ మ్యాన్ తెలిపారు.
సమ్మర్ మామూలుగా ఉండదు...
ఇక రాష్ట్రంలో 2023లోని వాతావరణ పరిస్థితులు ఈసారి కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉందని.. ఈ సారి సమ్మర్ ఎక్కువ రోజులు ఉంటుందని వెదర్ మ్యాన్ అంచనా వేస్తున్నారు. అంతేకాక నైరుతి రుతుపవనాలు ఈ సారి ఆలస్యం అవుతాయని.. అప్పటివరకు ఎండలు, ఉక్కపోత తప్పవని చెబుతున్నారు. ఇక రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ లోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వర్షాలు పడిన తర్వాత ఇక ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అందుకే మండువేసవిలో వానలు కురుస్తాయన్న సంతోషం కంటే.. ఆ తర్వాత ఎండలు అదిరిపోతాయన్న ఆందోళన అధికంగా ఉంది.