Weather Report : ఏడు గంటల నుంచే భానుడి భగభగలు.. మార్చిలో ఎలా ఉంటుందో?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం వేడెక్కింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం వేడెక్కింది. వేడిగాలు మొదలయ్యయి. తెల్లవారుజామున మాత్రం కొంత చలి వాతావరణం నెలకొంది. పగటి ఉష్ణోగ్రతలు నిదానంగా పెరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో అక్కడకక్కడ ఉదయం ఏడు గంటల వరకూ పొగమంచు ఉన్నప్పటికీ ఎనిమిది గంటల నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. గరిష్టంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్నటి వరకూ చలిగాలుల తీవ్రతతో ఇబ్బంది పడిన ప్రజలు ఇప్పుడు సూర్యప్రతాపంతో పగలు పది గంటలు దాటి బయటకు రావడానికి భయపడిపోతున్నారు.
చలిగాలులు కనుమరుగై...
ఆంధ్రప్రదేశ్ లో చలిగాలుల పూర్తిగా తగ్గిపోయింది. ఇక ఎండాకాలం మొదలయిందనే చెప్పాలి. శివరాత్రికి ఉన్న కాస్తంత చలి కూడా కనుమరుగవుతుందని చెబుతున్నారు. వాయువ్య ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ అంతటా పొడి వాతావరణం నెలకొని ఉంటుందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఏపీలో ఉక్కపోత మొదలయింది. ఇక విద్యుత్తు వాడకం కూడా గత రెండు రోజుల నుంచి పెరిగిందని అధికారులు వెల్లడించారు. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమలో నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశముందని పేర్కొంది. విశాఖలో అత్యధికంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఈ ప్రాంతాల్లో గరిష్టంగా...
తెలంగాణలోనూ చలిగాలుల తగ్గి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లోనూ ఎండగాలుల తీవ్రత మొదలయింది. ఈరోజు హైదరాబాద్ లో 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. మిగిలిన కొన్ని ప్రాంతాల్లో 32 నుంచి 33 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కంది. ప్రధానంగా ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, వరంగల్, కరీంనగర్ వంటి జిల్లాల్లో మిగిలిన ప్రాంతాల కంటే ఒకటి రెండు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని, రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది.