Weather Report : మండుతున్న ఎండలు.. ఫిబ్రవరిలోనే ఇదేందయ్యా సామీ?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేడి వాతావరణం నెలకొంది.

Update: 2026-02-14 04:29 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేడి వాతావరణం నెలకొంది. భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. గత వారం రోజుల నుంచి ఎండల తీవ్రత ఎక్కువవుతూ వస్తుంది. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఒకింత ఎక్కువగా ఎండల తీవ్రత ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే తెలంగాణలోనూ కొన్ని జిల్లాల్లో గరిష్టంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.

మూడు కలగలిపి...
ఆంధ్రప్రదేశ్ లో ఉక్కపోత, వేడి, వడగాలులు ప్రారంభమయ్యాయి. ఈ మూడు ఒక్కసారి రాష్ట్రంలోకి రావడంతో ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు. ఉక్కపోతతో చెమటలు కక్కుతున్నారు. వేడి గాలులతో విద్యుత్తు వాడకం పెరిగింది. వడగాలులు తీవ్రతతో జ్వరాల బాధనపడుతున్నారు. ఇలా వాతావరణం ఒక్కసారిగా మారింది. చలితీవ్రత నుంచి పెనంలోకి పడ్డట్టయిందన్న భావన ప్రజల్లో కలుగుతుంది. ఇప్పటికే అనేక చోట్ల 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిపోయాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర ఇలా ప్రాంతంతో సంబంధం లేకుండా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో నేడు పొడి వాతావరణం నెలకొని ఉంటుందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.
పగటి పూట మాత్రం...
తెలంగాణలోనూ చాలా వరకూ చలి అనేది లేదు. ఇంకా ఉక్కపోత మొదలు కాకపోయినా పగట పూట ఉష్ణోగ్రతలు మాత్రం గరిష్టంగానే నమోదవుతున్నాయి. పగలు అత్యధికంగా 33 డిగ్రీలు నమోదువుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ అధికారుల అంచనా మేరకు ఈ నెలలోనే 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. హైదరాబాద్ లో 31 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న కాలంలో మరింతగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని తెలిపింది. ఇక వచ్చే ఆదివారం నుంచి గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తుంది. రానున్న కాలంలో తెలంగాణలోనూ 45 డిగ్రీలు దాటే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.


Tags:    

Similar News