ప్రాక్టీస్ మ్యాచ్ లో విజయం సాధించిన భారత్

Update: 2022-10-17 07:40 GMT

టీ20 ప్రపంచకప్ లో భాగంగా మొదటి ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆస్ట్రేలియా ఆరంభం అదిరినా.. ఆఖరి ఓవర్లో మొహమ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో భారత్ 6 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఆఖరి నాలుగు బంతులకు నాలుగు వికెట్లు తీయడం విశేషం. ఇందులో కోహ్లీ అద్భుతమైన క్యాచ్ ను అందుకోవడం విశేషం. మిగిలిన వాటిలో రెండు అద్భుతమైన యార్కర్స్ ను షమీ సంధించాడు. ఆసీస్ ఇన్నింగ్స్ లో ఓపెనర్లు అద్భుతంగా రాణించారు. ఫించ్, మిచెల్ మార్ష్ అదరగొట్టారు. ఫించ్ 54 బంతుల్లో 76 పరుగులు చేయగా.. మార్ష్ 35 పరుగులు చేశాడు. మిగిలిన వారిలో మ్యాక్స్ వెల్ 23 పరుగులతో రాణించాడు. ఒకే ఒక్క ఓవర్ వేసిన షమీ నాలుగు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్ కు రెండు వికెట్లు దక్కగా... చాహల్, హర్షల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

మొదట బ్యాటింగ్ చేసిన భారతజట్టులో కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో మెరిశారు. కోహ్లీ, రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్ పర్వాలేదనిపించారు. రాహుల్ 33 బంతుల్లో 57 పరుగులు చేశాడ. అతడి ఇన్నింగ్స్ లో 3 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. రోహిత్ శర్మ 14 బంతుల్లో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కోహ్లీ(19) పర్వాలేదనిపించాడు. సూర్యకుమార్ యాదవ్ 33 బంతుల్లో 50 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. భారత్ 20 ఓవర్లు ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 2 పరుగులు చేసి విఫలమవ్వగా.. కార్తీక్ 14 బంతుల్లో 20 పరుగులు చేశాడు. అశ్విన్ 6 పరుగులు చేసి అవుట్ అవ్వగా.. అక్షర్ పటేల్ 6 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో కేన్ రిచర్డ్సన్ కు 4 వికెట్లు పడ్డాయి. బుధవారం నాడు న్యూజిలాండ్ తో భారత్ మరో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.


Tags:    

Similar News