ఆ సెలబ్రిటీ కపుల్ విడిపోయారంటూ వార్తలు.. మరి ఈ షో సంగతేంటి ?

Update: 2022-11-14 07:20 GMT

సానియా మీర్జా, షోయబ్ మాలిక్ అధికారికంగా విడాకులు తీసుకున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. పాకిస్థాన్ మోడల్ అయేషా ఒమర్‌తో షోయబ్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని.. అలా సానియాను మోసం చేశాడని వార్తలు వచ్చాయి. విడాకుల పుకార్ల మధ్య, సానియా, షోయబ్ 'ది మీర్జా మాలిక్ షో' అనే షోలో కలిసి కనిపించనున్నారు. ఉర్దూఫ్లిక్స్ పేరుతో పాకిస్తాన్ మొదటి ఉర్దూ OTT ప్లాట్‌ఫారమ్అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ లో ఇందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్‌లో సానియా షోయబ్ భుజంపై తన చేతిని వేసి నిలబడి ఉంది. చాలా మంది అభిమానులు ఇద్దరూ చాలా కాలం క్రితం ఈ షో షూట్ చేశారని అంటున్నారు.

కొన్ని రోజుల క్రితం, అయేషా ఒమర్‌తో షోయబ్ మాలిక్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. షోయబ్, సానియాల మధ్య మనస్పర్థలకు ఆయేషా కారణమని పలు నివేదికలు పేర్కొన్నాయి. సానియా, షోయబ్ ఇద్దరూ తమ వ్యక్తిగత జీవితాల గురించి మౌనంగా ఉన్నారు. పలు మీడియా నివేదికల ప్రకారం, సానియా విడిగా జీవిస్తోందని తెలుస్తోంది. ఆయేషా - షోయబ్ ఒక సంవత్సరం క్రితం ఫోటో షూట్ కోసం కలిసి పనిచేశారు. ఈ సమయంలోనే వీరిద్దరు సాన్నిహిత్యం పెంచుకున్నారని చెబుతున్నారు. సానియా-షోయబ్ 2010లో వివాహం చేసుకున్నారు. వారికి 2018లో ఇజాన్ అనే కుమారుడు జన్మించాడు.


Tags:    

Similar News