సెమీస్ లో సింధు ఓటమి.. రెఫరీలతో గొడవ

దూకుడుగా ఆడి తొలి గేమ్‌ను దక్కించుకున్న సింధు.. రెండో గేమ్‌ లో 14-11తో ఆధిక్యంలో ఉన్న సమయంలో సర్వీస్ ఆలస్యం చేస్తోందన్న..

Update: 2022-05-01 06:29 GMT

ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పీవీ సింధు సెమీస్ లో ఓడింది. దీంతో ఆమెకు కాంస్యం దక్కనుంది. టాప్ సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యమగుచి (జపాన్)తో జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో సింధు 21-13, 19-21, 16-21తో ఓటమి పాలైంది. దూకుడుగా ఆడి తొలి గేమ్‌ను దక్కించుకున్న సింధు.. రెండో గేమ్‌ లో 14-11తో ఆధిక్యంలో ఉన్న సమయంలో సర్వీస్ ఆలస్యం చేస్తోందన్న కారణంతో సింధుకు రిఫరీ ఒక పెనాల్టీ పాయింట్ విధించాడు. దీంతో రిఫరీతో వాదనకు దిగిన సింధు చీఫ్ రిఫరీకి ఫిర్యాదు చేసింది. ఈ ఘటన తర్వాత సింధు ఏకాగ్రత కోల్పోయింది. యమగుచి ఆ ఛాన్స్ ను వదులుకోలేదు. దూకుడు పెంచి వరుసగా పాయింట్లను గెలుచుకుని ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో గేమ్‌లో యమగుచి 21-16తో గెలుచుకుని ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఓడిన సింధు కాంస్యంతో సరిపెట్టుకుంది.

మ్యాచ్ అనంతరం సింధు మాట్లాడుతూ.. "మీరు చాలా సమయం తీసుకుంటున్నారని అంపైర్ నాకు చెప్పారు, కానీ ప్రత్యర్థి ఆ సమయంలో సిద్ధంగా లేదు," అని చెప్పుకొచ్చింది. "కానీ అంపైర్ ఆమెకు అకస్మాత్తుగా పాయింట్ ఇచ్చాడు. ఇది నిజంగా అన్యాయం. నేను ఓడిపోవడానికి అది ఒక కారణమని నేను భావిస్తున్నాను. ఆ సమయంలో అది 14-11 మరియు 15-11 కావచ్చు కానీ.. స్కోర్ 14-12 అయ్యింది. ఆ తర్వాత ఆమె వరుసగా పాయింట్లు సాధించింది. ఇది చాలా అన్యాయమని నేను భావిస్తున్నాను. బహుశా నేను మ్యాచ్ గెలిచి ఫైనల్‌లో ఆడి ఉండవచ్చు." అని సింధు తెలిపింది.


Tags:    

Similar News