World Cup : ఆస్ట్రేలియాపై భారత్ సూపర్ విక్టరీ... వందనాలు తల్లీ
మహిళ భారత జట్టు ఫైనల్స్ కు చేరుకుంది. ఆస్ట్రేలియాపై అలవోకగా ఛేజింగ్ లో భారీ లక్ష్యాన్ని సాధించింది
మహిళ భారత జట్టు ఫైనల్స్ కు చేరుకుంది. ఆస్ట్రేలియాపై అలవోకగా ఛేజింగ్ లో భారీ లక్ష్యాన్ని సాధించింది. జెమిమా రోడ్రిగ్స్ ధాటికి ఆస్ట్రేలియా కుప్పకూలింది.దీంతో భారత మహిళల వరల్డ్ కప్ ఫైనల్లోకి ప్రవేశించింది. భారత జట్టు బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ జీవితంలోనే గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడింది. గురువారం డీవై పాటిల్ స్టేడియంలో ఆస్ట్రేలియాపై జరిగిన మహిళల వన్డే వరల్డ్కప్ సెమీఫైనల్లో ఆమె అజేయంగా 134 బంతుల్లో 127 పరుగులు చేసి భారత్ జట్టును మూడో వరల్డ్కప్ ఫైనల్కి చేర్చింది. ఏడు సార్లు టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు జోరును అడ్డగించింది.
అద్భుతమైన భాగస్వామ్యం...
జెమిమా మూడో శతకం నమోదు చేయగా, ఇది ఆమెకు వరల్డ్కప్లో తొలి సెంచరీ. ఆమె కెప్టెన్ హర్మన్ప్రిత్ కౌర్తో మూడో వికెట్కు 167 పరుగుల అద్భుత భాగస్వామ్యం నెలకొల్పింది. దీని ఫలితంగా ర కొనసాగుతున్న ఆస్ట్రేలియా విజయపరంపరకు భారత మహిళల జట్టు చెక్ పెట్టినట్లయింది. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత్ దిగింది. జెమిమా ధైర్యంగా ఆడుతూ 14 ఫోర్లతో 127 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చింది. భారత్ 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 341 పరుగులు సాధించింది. మహిళల వన్డేల్లో ఇది అత్యధిక రన్ ఛేజ్.
చాలా ఏళ్ల తర్వాత...
అనేకసార్లు నాకౌట్ దశల్లో దగ్గరగా వచ్చి ఓటమి చవిచూసిన భారత్ ఈసారి దానిని అధిగమించింది. కౌర్, జెమిమా కన్నీళ్లు పెట్టుకున్నారు. గత అనుభవాలు గుర్తుకొచ్చాయి. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్ దక్షిణాఫ్రికాతో తలపడనుంది. రెండూ ఇప్పటివరకు టైటిల్ గెలవకపోవడంతో, కొత్త చాంపియన్ రావడం ఖాయంగా కనిపిస్తుంది. రెండో ఓవర్లో క్రీజ్కి వచ్చిన జెమిమా సాదాసీదా షాట్లతో రన్ రేట్ పైనే దృష్టి పెట్టింది. చివర్లో అలసటతో తూలుతూ కూడా ప్రేక్షకుల జోష్తో బ్యాటింగ్ కొనసాగించింది.
రెండు వికెట్లు కోల్పోవడంతో...
స్మృతి మంథాన 24 పరుగుల వద్ద ఔటవడంతో 59 పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. కానీ హర్మన్, జెమిమా జాగ్రత్తగా ఆడారు. కౌర్ గార్డ్నర్, మెక్గ్రాత్లపై ఆగ్రెసివ్గా ఆడింది. డ్యూ కూడా రావడంతో బ్యాటింగ్ సులభమైంది. 33వ ఓవర్లో జెమిమాకు లైఫ్ లభించింది. 82 వద్ద హీలీ క్యాచ్ వదిలింది. 106 వద్ద కూడా మరోసారి అదృష్టం కలిసొచ్చింది. షఫాలీ వర్మ 4 బంతుల్లో 8 పరుగులు చేసింది. కేవలం ఐదు బంతులు మాత్రమే నిలిచి అవుటైంది. స్మృతి మంథన డీఆర్ఎస్లో ఔటవ్వడంతో భారత జట్టు ఆరంభంలో ఒత్తిడికి లోనైంది. అయినా సరే జెమీమా రోడ్రిగ్జ్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ లు సూపర్ గా ఆడి భారత్ ను విజయతీరాలకు చేర్చారు. భారత మహిళ జట్టును అభినందించకుండా ఉండలేం.