భారీ విజయాన్ని అందుకున్న భారత్

డొమినికా వేదికగా వెస్టిండీస్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. భారత జట్టు ఆల్ రౌండర్ ప్రదర్శన

Update: 2023-07-15 01:27 GMT

డొమినికా వేదికగా వెస్టిండీస్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. భారత జట్టు ఆల్ రౌండర్ ప్రదర్శనతో మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగించింది. 312/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను మెుదలెపెట్టిన భారత్.. 425/5 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. మెుదటి ఇన్నింగ్స్ లో 271 పరుగుల ఆధిక్యంతో నిలిచింది. రెండో ఇన్నింగ్స్ లోనూ బంతితో అశ్విన్ మాయాజాలం సృష్టించడంతో కేవలం 130 పరుగులకే కుప్పకూలింది. 71 పరుగులు ఇచ్చిన అశ్విన్ 7 వికెట్లు తీశాడు. దీంతో భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలిచింది. మూడో రోజు చివరి సెషన్లో ఎనిమిది వికెట్లు తీసింది భారత్. విండీస్ రెండో ఇన్నింగ్స్ లో చివరి ఐదు వికెట్లు అశ్విన్ ఖాతాలోకి చేరాయి.

తొలి ఇన్నింగ్స్ లో భారత ప్లేయర్లలో యశస్వి జైస్వాల్(171 పరుగులు 387 బంతుల్లో) సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. యశస్వి జైస్వాల్ మూడో రోజు ఆటలో డబుల్ సెంచరీ అందుకుంటాడని భావించగా, 171 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. విండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్ బౌలింగ్ లో వికెట్ కీపర్ జాషువా డ సిల్వాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కెరీర్ లో తొలి టెస్టు ఆడుతున్న యశస్వి జైస్వాల్ విండీస్ బౌలింగ్ ను అలవోకగా ఎదుర్కొన్నాడు. మొత్తం 387 బంతులు ఆడిన జైస్వాల్ 16 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. రోహిత్ శర్మ(103 పరుగులు 221 బంతుల్లో) సెంచరీ సాధించాడు. విరాట్ కోహ్లీ(76 పరుగులు 182 బంతుల్లో) హాఫ్ సెంచరీ చేశాడు. జడేజా(37 పరుగులు 82 బంతుల్లో, నాటౌట్) కూడా రాణించాడు. తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 150 పరుగులకు ఆలౌట్ అయింది. అరంగేట్రంలోనే శతకంతో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. రెండో టెస్టు జులై 20న ప్రారంభమవుతుంది.


Tags:    

Similar News