సెంచరీతో దుమ్ము దులిపిన కోహ్లీ.. ధీటుగా బదులిస్తున్న విండీస్

విండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ లోకి మంచి స్కోరు సాధించింది.

Update: 2023-07-22 02:46 GMT

విండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ లోకి మంచి స్కోరు సాధించింది. ఓవర్‌ నైట్‌ స్కోరు 288/4తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా 438 పరుగులకు ఆలౌట్ అయింది. 87 పరుగుల వ్యక్తిగత స్కోర్‌తో రెండో రోజు బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లీ (121; 206 బంతుల్లో 11 ఫోర్లు) సెంచరీ చేశాడు. 180 బంతుల్లో శతకం పూర్తీ చేసుకున్నాడు. కోహ్లీ నాలుగున్నరేళ్ల తర్వాత విదేశీ గడ్డపై విజయం సాధించాడు. జడేజా (61; 152 బంతుల్లో 5 ఫోర్లు) అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ, ఆర్ జడేజా స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరినా ఆర్ అశ్విన్‌ (56; 78 బంతుల్లో 8 ఫోర్లు) అమూల్యమైన పరుగులు చేశాడు. ఇషాన్‌ కిషన్ (25), జయదేవ్ ఉనద్కత్‌ (7), మొహ్మద్ సిరాజ్‌ (0)లు వరుసగా పెవిలియన్‌ చేరారు. విండీస్‌ బౌలర్లలో కీమర్‌ రోచ్‌, వారికన్‌ తలో మూడు వికెట్లు పడగొట్టారు.

ఈ మ్యాచ్ లో విండీస్‌కు ఓపెనర్లు క్రైగ్ బ్రాత్‌వైట్, త్యాగ్‌నారాయణ్‌ చందర్‌పాల్ (33) శుభారంభం ఇచ్చారు. అయితే చందర్‌పాల్.. జడేజా బౌలింగ్‌లో అశ్విన్‌కు దొరికిపోయాడు. 71 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత క్రీజులోకి వచ్చిన మెకంజీ ఓ సిక్స్‌, ఫోర్ బాదిన అనంతరం రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ 86/1 స్కోరుతో నిలిచింది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (37), కిర్క్ మెకంజీ (14) క్రీజులో ఉన్నారు. విండీస్ జట్టు ఇంకా 352 పరుగుల వెనుకంజలో ఉంది.


Tags:    

Similar News