చిత్తు చిత్తైన దక్షిణాఫ్రికా.. సిరీస్ సమం చేసిన భారత్

భారత జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ కు టాస్ అసలు కలిసి రావడం లేదు. వరుసగా నాలుగు టీ-20 మ్యాచ్ లలోనూ టాస్ ఓడిపోయాడు.

Update: 2022-06-18 01:30 GMT

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భారత్ పుంజుకుంది. మొదటి రెండు టీ20 మ్యాచ్ లను కోల్పోయిన భారత్.. తర్వాతి రెండు మ్యాచ్ లలో ఘన విజయాలను అందుకుని సిరీస్ ను సమం చేసింది. నాలుగో టీ-20 మ్యాచ్ లో సఫారీలను భారత్ ఆటగాళ్లు ఓ ఆటాడుకున్నారు. దక్షిణాఫ్రికాను 87 పరుగులకే ఆలౌట్ చేసి సిరీస్ ను 2-2తో సమం చేశారు. రాజ్ కోట్ వేదికగా సాగిన ఈ మ్యాచ్ లో భారత్ 82 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.

భారత జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ కు టాస్ అసలు కలిసి రావడం లేదు. వరుసగా నాలుగు టీ-20 మ్యాచ్ లలోనూ టాస్ ఓడిపోయాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఆరంభంలోనే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (5) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ 26 బంతుల్లో 27 పరుగులు చేసి నోర్జే బౌలింగ్ లో వెనుదిరిగాడు. వన్ డౌన్ లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (4) నిరాశపరిచాడు. కెప్టెన్ రిషబ్ పంత్ 17 పరుగులు చేసి కేశవ్ మహరాజ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ లు దూకుడుగా ఆడారు. దినేశ్ కార్తీక్ 27 బంతుల్లోనే 55 పరుగులు చేశాడు. 9 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు దినేష్ కార్తీక్. ఇక హార్దిక్ పాండ్యా (31 బంతుల్లో 46 రన్స్) కూడా ధాటిగా ఆడడంతో టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 2 వికెట్లు తీయగా, మార్కో జాన్సెన్ 1, ప్రిటోరియస్ 1, నోర్జే 1, కేశవ్ మహరాజ్ 1 వికెట్ సాధించారు.
ఇక ఛేజింగ్ లో ఏ దశలోనూ సఫారీలు ఆకట్టుకోలేకపోయారు. 170 పరుగుల లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 16.5 ఓవర్లలో 87 పరుగులకే ఆలౌట్ అయింది. యువ పేసర్ అవేష్ ఖాన్ 18 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, చహల్ (2 వికెట్లు), హర్షల్ పటేల్ (1 వికెట్), అక్షర్ పటేల్ (1 వికెట్) వికెట్లు పడగొట్టడంతో టీమిండియా మంచి విజయాన్ని సాధించింది. సఫారీ ఇన్నింగ్స్ లో వాన్ డర్ డుస్సెన్ 20 పరుగులే టాప్ స్కోర్. కెప్టెన్ టెంబా బవుమా రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ చేరగా, అతడు మళ్లీ బ్యాటింగ్ కు రాలేదు. డికాక్ (14), ప్రిటోరియస్ (0), క్లాసెన్ (8), మిల్లర్ (9) విఫలమవడంతో భారత్ విజయం ఖాయమైంది. దినేష్ కార్తీక్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో 5 మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా 2-2తో సమం చేసింది. ఐదో టీ20 మ్యాచ్ ఈ నెల 19న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.


Tags:    

Similar News