India Vs South Africa T20 : ఓటమితో ఆరంభం... మనోళ్లు ఎప్పటిలాగే తడబడి.. అవుటవుతూ

దక్షిణాఫ్రికాతో జరిగిన ఇండియా రెండో టీ 20 మ్యాచ్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలయింది.

Update: 2023-12-13 02:27 GMT

T20 match

తొలి టీ20లో వరుణుడు విజయం సాధించగా... రెండో టీ 20లో భారత్ ఓటమి పాలయింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఇండియా రెండో టీ 20 మ్యాచ్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలయింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ను తొలుత చేపట్టిన ఇండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు ఇద్దరూ డకౌట్ గా నిలిచారు. ఎప్పటిలాగానే యశస్వి జైశ్వాల్ దూకుడుగా ఆడి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరో ఓపెనర్ శుభమన్ గిల్ ఎల్‌బిడబ్ల్యూ‌తో వెనుదిరిగాడు.

ఓపెనర్లు ఇద్దరూ....
దీంతో అప్పడు భారత్ స్కోరు పెద్దగా లేదు. అదే సమయంలో తెలుగు కుర్రోడు తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ లు కొంత నింపాదిగా ఆడుతూ స్కోరు బోర్డును పెంచారు. తిలక్ వర్మ 29 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఎక్కువ సేపు క్రీజులో లేకపోవడంతో భారత్ మూడు ముఖ్యమైన వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. తర్వాత సూర్యకుమార్ యాదవ్, రింకూసింగ్ లు మాత్రం నిలకడగా ఆడారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన జితేష్ శర్మ కూడా వెంటనే అవుట్ కావడంతో జడేజా వచ్చి కొంచెం రింకూ సింగ్‌కు మద్దతుగా నిలిచాడు.
రింకూ సింగ్ మాత్రం...
రింకూ సింగ్ 68 పరుగులు, జడేజా 19 పరుగులు చేశాడు. జడేజా అవుట్ అయిన తర్వాత 19.3 ఓవర్లకు భారత్ 180 పరుగులు చేసింది. ఆ మాత్రం పరుగులు చేస్తుంది అని కూడా అనుకోలేదు. అయినా రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్ వల్లనే ఈ స్కోరు సాధ్యమయింది. తర్వాత వర్షం కురియడంతో డక్ వర్త్ లూయీస్ పద్ధతిలో 15 ఓవర్లలో 152 పరుగులు చేయాలని నిర్దేశించారు. అయితే రీజా హెండ్రిక్స్, మాథ్యూ బ్రెయిట్టే తొలి రెండు ఓవర్లలోనే 32 పరుగులు చేశారు.
మన బౌలర్లు కూడా...
అప్పడే దక్షిణాఫ్రికా విజయం తధ్యమని పించింది. మాథ్యూ రనౌట్ అయ్యాడు. తొలి ఐదు ఓవర్లలోనే దక్షిణాఫ్రికా బ్యాటర్లు 68 పరుగులు చేయగలిగారు. చివరకు ఎనిమిది ఓవర్లకు 98 పరుగులు చేసింది. మరో ఓవర్ మిగిలి ఉండగానే 154 పరుగులు చేసింది దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. హెండ్రిక్స్ 49 పరుగులు చేసి సొంత గడ్డ మీద తన జట్టు పరువును నిలిపాడు. ఇక మన బౌలర్లు డెత్ ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇచ్చి విజయాన్ని ప్రత్యర్థి పరం చేసేశారు. దీంతో ఇక ఒక మ్యాచ్ మాత్రమే మిగిలింది ఆ మ్యాచ్ లో భారత్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. లేకుంటే దక్షిణాఫ్రికా సిరీస్ గెలిచినట్లవుతుంది.


Tags:    

Similar News