India Vs England Third Test : కుమ్మడం అంటే ఎలాగో కుర్రోళ్లు వాళ్లకు చూపించారుగా

రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్ లో భారత్ ఇంగ్లండ్ పై 434 పరుగుల తేడాతో విజయం సాధించింది

Update: 2024-02-19 03:03 GMT

భారత్ మూడో టెస్ట్‌లో ఘన విజయం సాధించింది. అయితే ఈ విజయం వెనక బ్యాటర్లు, బౌలర్లు సమిష్టి విజయమనే చెప్పాలి. దీంతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్ లో 2 -1 ఆధిక్యతలో ఉంది. హైదరాబాద్ మ్యాచ్ లో ఇంగ్లండ్ విజయం సాధించగా, విశాఖ, రాజ్‌కోట్‌లలో భారత్ బ్యాక్ టు బ్యాక్ విక్టరీ కొట్టింది. దీంతో ఇంగ్లండ్‌పై భారత్ దే పై చేయి అయింది ఇంత త్వరగా మ్యాచ్ ముగుస్తుందని భావించలేదు. అయితే భారీ స్కోరు ఉండటంతో భారత్ వైపు విజయం మొగ్గు చూపుతున్నప్పటికీ ఇంగ్లండ్ బౌలర్లు అంత తేలిగ్గా మనకు లొంగుతారని అనుకోలేదు. కానీ మనోళ్లు సాధించేశారు. మ్యాచ్ ను బౌలర్లు మనవైపు తిప్పేశారు. మడతెట్టేశారు.

భారీ పరుగుల తేడాతో...
రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్ లో భారత్ ఇంగ్లండ్ పై 434 పరుగుల తేడాతో విజయం సాధించింది. మన బౌలర్లు 122 పరుగులకే ఇంగ్లండ్ బ్యాటర్లను పెవిలియన్ కు పంపారు. బౌలర్లలో జడేజా స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ ను చావు దెబ్బతీశాడు. జడేజా ఆల్ రౌండర్ ప్రతిభ మరోసారి మ్యాచ్ లో కనిపించింది. థర్డ్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో జడేజా ఐదు వికెట్లు తీయగా, కులదీప్ యాదవ్ రెండు, బుమ్రా, అశ్విన్ చెరో వికెట్ తీశారు. దీంతో ఇంగ్లండ్ కధ ముగిసింది. ఇంగ్లండ్ కూడా ఇంత పెద్ద భారీ ఓటమిని ఊహించి ఉండకపోవచ్చు. కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయామన్న బాధ, ఆక్రోశం వారిలో కనిపించింది.
కుర్రాళ్లదే ఈ విజయం...
ఇక బ్యాటర్ల విషయానికి వస్తే యశస్వి జైశ్వాల్ మరోసారి డబుల్ సెంచరీ సాధించాడు. 214 పరుగులు చేసిన యశస్వి జైశ్వాల్ రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసే వరకూ అవుట్ కాలేదు. ఇక శుభమన్ గిల్ ఈ మ్యాచ్ లో తన సత్తాను చూపాడు. శుభమన్ గిల్ 91 పరుగులు చేశాడు. ఇక రాజ్‌కోట్ లో అరగ్రేటం చేసిన సర్ఫరాజ్ ఖాన్ కూడా రెండో ఇన్నింగ్స్ లోనూ హాఫ్ సెంచరీ చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ 72 బంతుల్లో 68 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీ చేసిన సర్ఫరాజ్ ఖాన్ ఇక టీం ఇండియా జట్టులో కుదురుకున్నట్లే కనిపిస్తుంది. రాజ్‌కోట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన జడేజా ఈ మ్యాచ్ లో ఏడు వికెట్లు తీయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. మొత్తం మీద మనోళ్లు ఇంగ్లండ్ ను సొంత గడ్డమీద మడతపెట్టేశారంటూ కామెంట్స్ వినపడుతున్నాయి. నాలుగో టెస్ట్ 23వ తేదీ నుంచి రాంచీలో జరగనుంది.


Tags:    

Similar News