ఐపీఎల్ కు గుడ్ బై చెప్పిన హైదరాబాదీ ప్లేయర్

ధోనీ కంటే ముందే రిటైర్మెంట్ ప్రకటించాడు అంబటి రాయుడు. కొన్ని సీజన్లుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆడుతున్న..

Update: 2023-05-28 13:14 GMT

ambati rayudu retirement

ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ కు ముందే.. చెన్నై జట్టులో ఆడుతున్న ఓ హైదరాబాదీ ప్లేయర్ ఊహించని షాకిచ్చాడు. ధోనీ కంటే ముందే రిటైర్మెంట్ ప్రకటించాడు అంబటి రాయుడు. కొన్ని సీజన్లుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆడుతున్న రాయుడు.. ఈరోజు గుజరాత్ లోని అహ్మదాబాద్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ తనకు ఆఖరి మ్యాచ్ అని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. గతంలోనూ రాయుడు ఇలాంటి ప్రకటన చేశాడు కానీ.. యూ టర్న్ తీసుకున్నాడు. ఈసారి యూటర్న్ లేదని రాయుడు క్లారిటీ ఇచ్చేశాడు.

అంబటి రాయుడు 2010 నుండి ఇప్పటి వరకూ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు 202 మ్యాచ్ లు ఆడాడు. 127.29 స్ట్రైక్ రేట్ తో 4,329 పరుగులు చేశాడు. అలాగే 14 సీజన్లలో 11 సార్లు ప్లే ఆఫ్స్ ఆడిన టీమ్ లో రాయుడు ఉన్నాడు. ఐపీఎల్ ఫైనల్స్ లో 8 సార్లు ఆడిన అంబటి రాయుడు.. ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ ను గెలిచిన చెన్నై జట్టులో ఉన్నాడు. ఈ రోజు ఆరోసారి చెన్నై ఫైనల్స్ ఆడుతుండగా.. మ్యాచ్ కు ముందు తన రిటైర్మెంట్ ప్రకటనతో అభిమానులకు షాకిచ్చాడు.
కాగా.. అంబటి రాయుడు రాజకీయాల్లోకి రాబోతున్నాడంటూ ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించిన రాయుడు.. ఇటీవలే ఆయన్ను స్వయంగా కలిశాడు. రాయుడు సీఎం ను కలవడంతో త్వరలోనే ఆయన వైసీపీలో చేరతాడని, రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటనతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.


Tags:    

Similar News