బాబు, ప‌వ‌న్‌, లోకేశ్‌లు గెస్ట్ ఆర్టిస్టులు.. సజ్జల సెటైర్స్

ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిణామాలపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-06-03 11:20 GMT

ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిణామాలపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్‌ రాజకీయ నాయకుడైన చంద్రబాబు.. టీడీపీ మేనిఫెస్టోను వైఎస్‌ జగన్‌ పొగిడారని తనకు తానే చెప్పుకోవడం వింతగా, విడ్డూరంగా ఉందన్నారు. పగటి కలలు కంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారని సజ్జల సెటైర్ వేశారు. బీజేపీతో ఎలాగైనా పొత్తులు పెట్టుకోవాలని చంద్రబాబు పాకులాడుతున్నారని, అందుకే హస్తినా పర్యటనకు వెళ్తున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రుల‌తో చంద్ర‌బాబుకి అపాయింట్‌మెంట్ దొరికింద‌ని టీడీపీ సంబ‌ర‌ప‌డుతుండ‌డంతో సజ్జల చుర‌క‌లు అంటించారు.

సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్తే.. ఇష్టానుసారంగా మాట్లాడేవాళ్లు.. ఇప్పుడు చంద్రబాబు గురించి ఏం మాట్లాడుతారో చెప్పాలని ప్రశ్నించారు. అటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్రపై కూడా సజ్జల స్పందించారు. పవన్‌ యాత్రపై తమకేం అభ్యంతరం లేదన్నారు. తాము కూడా ప్రజల మధ్య తిరగమనే చెబుతున్నామని అన్నారు. అయితే పవన్‌ ప్రజల మధ్య ఎంత వరకు తిరుగుతాడనేదానిపై నమ్మకం లేదని సెటైర్‌ వేశారు. గతంలో కొడుకు కోసం పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్రను చంద్రబాబు ఆపినట్టు తెలుసిందని సజ్జల కామెంట్ చేశారు. ఒక కులాన్ని నమ్ముకుని రాజకీయాల్లోకి వస్తే.. ప్రజలు ఎప్పటికీ ఆమోదం తెలుపరని స్పష్టం చేశారు.

నారా లోకేష్‌ తన యువగళం పాదయాత్రలో చవకబారుగా వివేకా హత్య కేసు అంశంపై ప్లకార్డులు ప్రదర్శిస్తున్నాడని సజ్జల అన్నారు. లోకేష్‌ ది చిల్లర వ్యవహారం అంటూ విమర్శించారు. ఇలా కిందిస్థాయి కార్య‌క‌ర్తలు చేస్తే అర్థం చేసుకోవ‌చ్చ‌న్నారు. లోకేష్‌కు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏదైనా మానసిక వైకల్యం ఏర్పడి ఉండొచ్చని వ్యంగ్యంగా మాట్లాడారు. ఏపీలో చంద్రబాబు, పవన్, లోకేశ్ అంతా గెస్ట్‌ యాక్టర్సేనని సజ్జల అభివర్ణించారు. ఇప్పుడు సజ్జల చేసిన కామెంట్స్‌తో ఏపీ రాజకీయాలు మరింత హాట్‌గా మారాయి. సజ్జల కామెంట్స్‌ ప్రతిపక్ష నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Tags:    

Similar News