Pawan, Tdp : ఏమయ్యా పవనూ.. ఇప్పుడైనా నిలదీయకపోతే ఎలాగయ్యా?

టీడీపీ తెలంగాణాలో లోపాయికారీగా కాంగ్రెస్ కు మద్దతిస్తున్నా జనసేన మౌనంపై చర్చ జరుగుతుంది

Update: 2023-11-18 05:40 GMT

రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి పదేళ్లు అవుతుంది. అయితే రెండుచోట్ల ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఎవరి పాలన వారిది. ఎవరి అధికారం వారిది. కానీ జాతీయ పార్టీలు రెండు చోట్ల కాలు మోపేందుకు సిద్ధమవుతున్నాయి. ఎవరిదీ తప్పు కాదు. అధికారం కోసం ఎవరైనా ప్రయత్నించవచ్చు. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే.. పొత్తులు మాత్రమే. ప్రధానంగా ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణలో వ్యవహరిస్తున్న తీరు హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు జైలు జీవితాన్ని 52 రోజుల పాటు గడిపి వచ్చిన తర్వాత పూర్తిగా ఆ పార్టీ వైఖరిలో మార్పు వచ్చింది. నిర్ణయాలను కూడా మార్చుకోవాల్సి వచ్చింది.

పోటీకి దూరంగా...
జైలు నుంచే తాము తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించి టీడీపీ పక్కకు తప్పుకుంది. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ ఈసారి మాత్రం భిన్నమైన నిర్ణయం తీసుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. చంద్రబాబు జైలుకు వెళ్లకముందు ఖమ్మంలో భారీ బహిరంగ సభ పెట్టారు. మరోసభను కూడా పెట్టాలని నేతలకు సూచించారు. అంతేకాదు ఈసారి టీడీపీ తెలంగాణలో పోటీ చేస్తుందని కూడా ప్రకటించారు. అప్పటి వరకూ బీజేపీతో తమతో ఏపీలో కలుస్తుందన్న నమ్మకంతోనే ఆ కామెంట్స్ చేశారంటారు. తెలంగాణలోనూ కమలం పార్టీతో పొత్తుకు ఆయన ప్రయత్నించినా సాధ్యపడలేదు. పైగా తాను జైలుకు వెళ్లడానికి పరోక్షంగా బీజేపీ హస్తం ఉందని భావించిన చంద్రబాబు ఎన్నికల బరి నుంచి తప్పుకుని అందరికీ షాక్ ఇచ్చారు.
అధికారిక పొత్తు...
అయితే ఏపీలో జనసేనతో అధికారిక పొత్తు కుదుర్చుకున్న చంద్రబాబు ఇక్కడ మాత్రం పరోక్షంగా కాంగ్రెస్ కు అనుకూలంగా మారారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనేక కాంగ్రెస్ సమావేశాల్లో టీడీపీ శ్రేణులు పాల్గొంటుండటమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తులో ఉంది. జనసేన ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తుంది. ముఖ్యంగా జనసేన ఖమ్మం నియోజకవర్గంలో పోటీకి దిగింది. కానీ ఖమ్మంలో టీడీపీ శ్రేణులు మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుకు మద్దతు తెలుపుతుండటం విశేషం. దీంతో తెలంగాణలో టీడీపీ లోపాయికారీగా కాంగ్రెస్ తో కలసి సైకిల్ పార్టీ నడుస్తుండటంతో ఏపీలో ఏం జరుగుతుందన్న దానిపై చర్చ మొదలయింది.
కాంగ్రెస్ కు మద్దతుగా...
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్‌లోనే ఉంటున్నా కనీసం తెలంగాణలో జనసేనకు మద్దతివ్వాలని ఎందుకు ప్రకటించరన్న ప్రశ్న తలెత్తుతుంది. తాను ప్రచారానికి రాకపోయినా ఒక ప్రకటన అయినా చంద్రబాబు చేయవచ్చు కదా? అని కొందరు నిలదీస్తున్నారు. ఏపీలో ఒకలా, తెలంగాణలో మరొకలా టీడీపీ వ్యవహరించడాన్ని రెండు రాష్ట్రాల ప్రజలు గమనిస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. పొత్తులు అధికారికంగా కుదుర్చుకున్న తర్వాత కూడా జనసేనకు ఎందుకు మద్దతివ్వలేకపోతున్నారన్నది ఆ పార్టీ క్యాడర్ నుంచి వినిపిస్తున్న మాట. ఇక్కడ కాంగ్రెస్ కు టీడీపీ ఓటు బ్యాంకును బదిలీ చేయడానికే చంద్రబాబు మౌనం వహిస్తున్నారని, తెలంగాణ ప్రభావం రానున్న ఏపీ ఎన్నికలపై ఉంటుందని కూడా చెబుతున్నారు. దీనిపై పవన్ కల్యాణ్ కూడా స్పందించాలని కోరుతున్నారు.
Tags:    

Similar News