జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేపై సుప్రీం స్టే

జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయంగా సర్వే చేయాలని భారత పురావస్తు విభాగాన్ని వారణాసికి చెందిన కోర్టు శుక్రవారం (జులై 21)..

Update: 2023-07-24 09:40 GMT

gyanvapi masjid survey

ఉత్తరప్రదేశ్ వారణాసిలో కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకుని ఉన్న జ్ఞానవాపి మసీదులో నేటి నుంచి పురావస్తు విభాగం (ఏఎస్ఐ) సర్వే ప్రారంభించింది. తాజాగా ఈ సర్వేపై సుప్రీంకోర్టు స్టే విధించింది. బుధవారం (జులై 26) సాయంత్రం 5 గంటల వరకూ మసీదులో ఏఎస్ఐ సర్వేను ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ప్రతివాదుల వాదన వినేంతవరకూ స్టే విధించాలని తాము భావిస్తున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ పేర్కొన్నారు. వారణాసి కోర్టు ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించాలని మసీద్ కమిటీకి సుప్రీం సీజేఐ ధర్మాసనం సూచించింది.

జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయంగా సర్వే చేయాలని భారత పురావస్తు విభాగాన్ని వారణాసికి చెందిన కోర్టు శుక్రవారం (జులై 21) ఆదేశించింది. ఈ సర్వే నుంచి మసీదు ప్రాంగణంలో ఉన్న శివలింగం (వజుఖానా)ను మినహాయించింది. గతంలో హిందూ ఆలయం ఉన్న ప్రాంతంలో మొఘలుల కాలంలో జ్ఞానవాపి మసీదును నిర్మించారని, దానిపై ఏఎస్ఐ తో కార్బన్ డేటింగ్ చేయించి నిజనిజాలు తేల్చాలని కోరుతూ.. హిందూ కక్షిదారులు చేసిన విజ్ఞప్తి మేరకు వారణాసి కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలు తమకు ఆమోదయోగ్యంగా లేవంటూ.. మసీదు మేనేజ్ మెంట్ కమిటీ తరపు న్యాయవాది మహమ్మద్ తాహిద్ ఖాన్ తెలుపడంతో.. సుప్రీంకోర్టు ఏఎస్ఐ సర్వేపై స్టే విధించింది.


Tags:    

Similar News