మాయ చేసిన మేడమ్ 'N'.. భారత ఇన్ఫ్లుయెన్సర్లు అలా సమాచారం ఇచ్చారా?
భారత్ కు చెందిన పలువురు ఇన్ఫ్లుయెన్సర్లు పాకిస్థాన్ కు కీలక సైనిక సమాచారాన్ని అందించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
భారత్ కు చెందిన పలువురు ఇన్ఫ్లుయెన్సర్లు పాకిస్థాన్ కు కీలక సైనిక సమాచారాన్ని అందించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పాకిస్థాన్కు చెందిన ఓ మహిళా వ్యాపారవేత్త, భారతీయ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను తన దేశానికి రప్పించి, వారిని గూఢచారులుగా మార్చేందుకు పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. లాహోర్లో 'జైయానా ట్రావెల్ అండ్ టూరిజం' పేరుతో ఓ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్న నోషాబా షెహజాద్ అనే మహిళ ఈ కుట్రలో కీలక పాత్ర పోషించింది.
ఐఎస్ఐ వర్గాల్లో 'మేడమ్ ఎన్' అనే కోడ్నేమ్తో ఈమెను పిలుస్తారు. జ్యోతి మల్హోత్రా వంటి పలువురు భారతీయ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు పాకిస్థాన్ పర్యటనలకు ఏర్పాట్లు చేసింది. నోషాబా షెహజాద్ భర్త పాకిస్థాన్ సివిల్ సర్వీసెస్లో రిటైర్డ్ అధికారి. ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలోని వీసా విభాగంపై నోషాబా షెహజాద్కు మంచి పట్టు ఉంది. ఆమె కేవలం ఒక్క ఫోన్ కాల్తో ఎవరికైనా తక్షణమే పాకిస్థాన్ వీసా ఇప్పించగలిగేదట.