సెప్టెంబర్ 24 వరకూ స్కూళ్లకు సెలవులు

కేరళలోని కోజికోడ్ జిల్లాలో నిపా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వచ్చే ఆదివారం

Update: 2023-09-16 03:48 GMT

కేరళలోని కోజికోడ్ జిల్లాలో నిపా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వచ్చే ఆదివారం వరకు అన్ని విద్యా సంస్థలను వారం రోజుల పాటు మూసివేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలోని పాఠశాలలు, ప్రొఫెషనల్ కాలేజీలు, ట్యూషన్ సెంటర్లు, ఇతర విద్యా సంస్థలను మూసివేయనున్నారు. శుక్రవారం మరో నిపా వైరస్ ఇన్‌ఫెక్షన్ నిర్ధారణ కావడంతో ఆంక్షలను కఠినతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఆరుకు చేరుకుంది. నిఫా వైరస్‌ సోకి ఇద్దరు మృతి చెందారు.

వారం రోజుల పాటు అన్ని విద్యా సంస్థల్లో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించవచ్చని జిల్లా యంత్రాంగం చెబుతోంది. ప్రస్తుతం నిపా వైరస్ సోకిన వారితో పరిచయం ఉన్న వారి జాబితా 1080కి చేరుకుందని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ శుక్రవారం తెలిపారు. వీరిలో శుక్రవారం ఒక్కరోజే 130 మంది జాబితాలో చేరారు. మొత్తం 1080 మందిలో 327 మంది ఆరోగ్య కార్యకర్తలు కూడా ఉన్నారు. ఇతర జిల్లాల్లో నిపా సోకిన వ్యక్తుల కాంటాక్ట్ లిస్ట్‌లో మొత్తం 29 మంది ఉన్నారని ఆరోగ్య మంత్రి చెప్పారు. వీరిలో మలప్పురం నుండి 22 మంది, వాయనాడ్ నుండి ఒకరు, కన్నూర్, త్రిస్సూర్ నుండి ముగ్గురు చొప్పున ఉన్నారు.హై-రిస్క్ కేటగిరీలో 175 మంది సాధారణ పౌరులు కాగా 122 మంది ఆరోగ్య కార్యకర్తలు. కాంటాక్ట్ లిస్ట్‌లో చేరిన వారి సంఖ్య పెరగవచ్చని ఆరోగ్య మంత్రి కూడా చెప్పారు. జ్వరం మరియు వైరస్ సంక్రమణ లక్షణాల కారణంగా రెండు మరణాలు నమోదవడంతో కేరళ రాష్ట్రం సెప్టెంబర్ 12 న నిపా వైరస్ హెచ్చరికను జారీ చేసింది.


Tags:    

Similar News