వీధికుక్కల దాడిలో బాలుడి మృతి

ఆదివారం సాయంత్రం ఇంటికి సమీపంలో ఆడుకుంటుండగా వీధికుక్కలు నిహాల్ పై దాడి చేసి.. నిర్మానుష్య ప్రదేశానికి ఈడ్చుకెళ్లాయి.

Update: 2023-06-13 07:10 GMT

వీధికుక్కల దాడిలో ఒక మూగబాలుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషాద ఘటన జూన్ 11, ఆదివారం చోటుచేసుకుంది. కన్నూర్ లోని ముజాపిలంగాడ్ కిటినకం మసీదుకి సమీపంలో నిహాల్ నౌషాద్ (11) ఆటిజం సమస్యతో బాధపడుతున్నాడు. పుట్టి 11 ఏళ్లైనా ఇంతవరకూ మాటలు రాలేదు. ఆదివారం సాయంత్రం ఇంటికి సమీపంలో ఆడుకుంటుండగా వీధికుక్కలు నిహాల్ పై దాడి చేసి.. నిర్మానుష్య ప్రదేశానికి ఈడ్చుకెళ్లాయి. ఆడుకుంటానని వెళ్లిన పిల్లాడు రాత్రైనా ఇంటి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికి, ఎక్కడా కనిపించకపోవడంతో మిస్సైంగ్ కంప్లైంట్ ఇచ్చారు.

రంగంలోకి దిగిన పోలీసులు.. బాలుడి ఇంటికి అర కిలోమీటరు దూరంలోని నిర్మానుష్య ప్రదేశంలో ఒంటి నిండా తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించారు. గాయాలతో తీవ్ర రక్తస్రావంతో ఉన్న బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు పంపి.. కేసు నమోదు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలుప్రాంతాల్లో తరచూ వీధికుక్కల దాడులు జరుగుతూనే ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్ 13న కేరళలో వీధికుక్కల దాడిలో పన్నెండేళ్ల బాలుడు మృతి చెందాడు. వీధికుక్కలను చంపడం పరిష్కారం కాదన్న సీఎం పినరయి విజయన్.. ఇందుకు మరో పరిష్కారం కనుగొనాలని అభిప్రాయపడ్డారు.






Tags:    

Similar News