25 కోట్ల వ్యవహారంపై స్పందించిన సమంత

ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామాన్ని ప్రకటించింది. మయోసైటిస్‌ చికిత్స కోసం టాలీవుడ్‌కు

Update: 2023-08-05 08:46 GMT

హీరోయిన్ సమంత ‘మయోసిటిస్’ వ్యాధితో బాధపడుతున్నానని చెప్పి అభిమానులను షాక్ కు గురి చేసింది. ఆ వ్యాధి నుండి కోలుకుంటూ ఉంది సమంత. తన ఆరోగ్యంపై దృష్టి పెట్టి.. చేతుల్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తీ చేసేసింది. ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామాన్ని ప్రకటించింది. మయోసైటిస్‌ చికిత్స కోసం టాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్‌ హీరో నుంచి రూ. 25 కోట్ల ఆర్ధిక సాయంను సమంత తీసుకుందంటూ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై తాజాగా సమంత స్పందించింది.

సమంత ఈ వార్తలపై సీరియస్ గా స్పందించకుండా.. వివరణాత్మక విశ్లేషణ ఇచ్చింది. ‘మయోసైటిస్‌ చికిత్సకు 25 కోట్లా?. ఎవరో మీకు తప్పుడు సమాచారం ఇచ్చారు. మీరు చెప్పిన దాంట్లో అతి చిన్న మొత్తాన్ని మాత్రమే ఖర్చు చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. నా కెరీర్‌లో ఇప్పటివరకూ పని చేసినందుకు జీతంగా రాళ్లూరప్పలు ఇవ్వలేదనుకుంటున్నా. నన్ను నేను జాగ్రత్తగా చూసుకోగలను. మయోసైటిస్‌ కారణంగా వేలాది మంది బాధపడుతున్నారు. ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన సమాచారాన్ని అందించే ముందు దయచేసి బాధ్యత వహించండి’ అని చెప్పుకొచ్చింది శామ్. సమంత మీద వైరల్ అవుతున్న వదంతుల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టమవుతోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండతో ఖుషి మూవీ షూటింగ్ పూర్తిచేసిన సామ్.. ‘సిటడెల్‌’ వెబ్ సిరీస్ తో సందడి చేయనుంది.


Tags:    

Similar News