టైగర్ నాగేశ్వరరావు, క్రాక్‌ మధ్య కనెక్షన్.. రియల్ లైఫ్‌లో ఢీ కొట్టుకున్న దొంగ-పోలీస్..

టైగర్ నాగేశ్వరరావు, క్రాక్‌ సినిమాల మధ్య ఒక థ్రిల్లింగ్ కనెక్షన్ ఉందట. ఈ విషయాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని బయటపెట్టాడు.

Update: 2023-10-16 12:00 GMT

రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు'.. 19వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్ స్టూవర్టుపురం ప్రాంతంలో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు లైఫ్ స్టోరీ ఆధారంగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక గతంలో రవితేజ నటించిన 'క్రాక్' సినిమా కూడా ఒంగోలు ప్రాంతంలోని కొన్ని రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ఆధారంగానే తెరకెక్కింది. ఆ మూవీలోని హీరో సీఏ శంకర్, రౌడీ కఠారి కృష్ణ రోల్స్.. నిజ జీవితంలోని సీఏ మురళి, కఠారి కృష్ణ వ్యక్తుల నుంచి స్ఫూర్తి పొందినవి.

అయితే ఈ రెండు సినిమాలకు ఒక థ్రిల్లింగ్ కనెక్షన్ ఉందట. ఈ విషయాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని బయటపెట్టాడు. ఈ రెండు చిత్రాలు మధ్య కనెక్షన్ అంటే.. హీరో రవితేజ అనుకుంటున్నారేమో, అసలు కాదు. రియల్ లైఫ్ పాత్రలు అయిన టైగర్ నాగేశ్వరరావు, సీఏ మురళి.. దొంగ-పోలీసుగా ఢీ కొట్టుకున్నారట. సీఏ మురళి ఒంగోలు వచ్చి కఠారి కృష్ణని పట్టుకోవడానికి కంటే ముందు స్టువర్టుపురం ప్రాంతంలో పని చేశాడట.
అక్కడ టైగర్ నాగేశ్వరరావుని పట్టుకోవడానికి సీఏ మురళి కూడా పని చేశాడట. స్టూవర్టుపురం ప్రాంతంలో నాగేశ్వరరావుతో ఢీ కొట్టిన సీఏ మురళి.. అక్కడి నుంచి ఒంగోలు ట్రాన్స్‌ఫర్ అయ్యి కఠారి కృష్ణ ఆట కట్టించాడు. సీఏ మురళి పాత్రని ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కూడా చూపిస్తున్నారట. ఈ విషయాన్ని గోపీచంద్ మలినేని రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బయట పెట్టాడు.
ఇక ఇది తెలుసుకున్న అభిమానులు థ్రిల్ ఫీల్ అయ్యి.. "రవితేజ సినిమాటిక్ యూనివర్స్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ టైగర్ నాగేశ్వరరావు సినిమాని కొత్త దర్శకుడు వంశీ డైరెక్ట్ చేస్తున్నాడు. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీలో రేణుదేశాయ్ ఒక ముఖ్య పాత్ర చేస్తుంది. అక్టోబర్ 20న దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీతో రవితేజ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాడు.


Tags:    

Similar News