తెనాలిలో పునీత్ రాజ్ కుమార్ భారీ విగ్రహం

పునీత్ మొదటి వర్థంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు వినూత్న కార్యక్రమాలు..

Update: 2022-10-29 06:36 GMT

puneeth rajkumar 21 feet statue

దివంగత స్టార్ హీరో, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్.. అందరినీ వదిలి వెళ్లి అప్పుడే ఏడాది (అక్టోబర్ 29) గడిచిపోయింది. అప్పు లేడన్న విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఓవైపు సినిమాలు.. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు పునీత్. కానీ.. చిన్న వయసులోనే గుండెపోటుకు గురై అందర్నీ వదిలి వెళ్లిపోయారు.

పునీత్ మొదటి వర్థంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. తెలుగునాట కూడా పునీత్ కు అశేష అభిమానగణం ఉంది. ఈ నేపథ్యంలో పునీత్ జ్ఞాపకార్థం గుంటూరు జిల్లా తెనాలిలో 21 అడుగుల ఫైబర్ గ్లాస్ విగ్రహాన్ని సిద్ధం చేశారు. తెనాలికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్ష కలిసి భారీ విగ్రహాన్ని తయారు చేశారు. 21 అడుగుల ఎత్తులో 3డీ టెక్నాలజీతో ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు తెలుస్తోంది.
నాలుగు నెలలపాటు కష్టపడి తయారు చేసిన ఈ విగ్రహాన్ని.. త్వరలోనే బెంగళూరుకు తరలించనున్నారు. ప్రస్తుతం తెనాలిలోని సూర్య శిల్పశాల వద్ద పునీత్ ఫైబర్ విగ్రహాన్ని ప్రదర్శనగా ఉంచారు. నవంబర్ 1న పునీత్ రాజ్ కుమార్‌ గౌరవార్థం కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్టాత్మక కర్ణాటక రత్న పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. ఈ కార్యక్రమంలో పునీత్ ఫైబర్ విగ్రహాన్ని ప్రదర్శించనున్నారని తెలుస్తోంది. అప్పు మొదటి వర్ధంతిని పురస్కరించుకుని అభిమానులు కన్నడ నాట అన్నదానం, రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నాను.


Tags:    

Similar News