దివంగత దర్శకుడు కె.విశ్వనాథ్ భార్య కన్నుమూత

విశ్వనాథ్ మరణించే సమయానికి ఆమె వృద్ధాప్య సమస్యలతో బెడ్ రెస్ట్ లో ఉన్నారు. ఆయన మరణానంతరం జయలక్ష్మి అనారోగ్యం మరింత..

Update: 2023-02-27 02:20 GMT

k.vishwanath wife dies at 86

దివంగత దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ భార్య జయలక్ష్మి (86) గుండెపోటుతో మరణించారు. విశ్వనాథ్ (92) మరణించిన 24 రోజులకే జయలక్ష్మి కన్నుమూయడం.. ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. విశ్వనాథ్ మరణించే సమయానికి ఆమె వృద్ధాప్య సమస్యలతో బెడ్ రెస్ట్ లో ఉన్నారు. ఆయన మరణానంతరం జయలక్ష్మి అనారోగ్యం మరింత ఎక్కువైంది. ఈ క్రమంలో ఆదివారం ఆమె గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు.

తెలుగు సినీ దర్శక దిగ్గజమైన కాశీనాధుని విశ్వనాథ్ కు 20 ఏళ్ల వయసులోనే జయలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. వీరిలో ఎవరూ సినీ పరిశ్రమలో అడుగుపెట్టలేదు. అలాగే ఆయన భార్య సైతం సినిమాల ప్రస్తావన తీసుకొచ్చేది కాదని విశ్వనాథ్ ఒకానొక సందర్భంలో తెలిపారు. నేటి మధ్యాహ్నం పంజాగుట్ట శ్మశానవాటికలో ఆమె భౌతిక కాయానికి అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. విశ్వనాథ్ సతీమణి మరణం పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.


Tags:    

Similar News