OTT Movies : ఓటీటీలకు షాకిచ్చిన కేంద్రం..

కనీసం 20 సెకండ్ల నుంచి 30 సెకండ్ల వరకు ఆ యాడ్స్ ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది. విజువల్స్ తో పాటు ప్రాంతీయ భాషల్లో..

Update: 2023-06-01 04:21 GMT

ఇటీవల కాలంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ లు విపరీతంగా పెరిగిపోగా.. ప్రేక్షకుల వాడకం కూడా అందుకు తగ్గట్టుగానే ఉంది. నలుగురున్న ఫ్యామిలీ థియేటర్లో సినిమాకు వెళ్లాలంటే కనీసం రూ.1000కి తక్కువ ఖర్చవదు. అదేదో ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే ఎంచక్కా ఇంట్లోనే అంతా కలిసి సినిమాలు చూడొచ్చు. అవిమాత్రమేనా.. వెబ్ సిరీస్ లు, సింగిగ్ షో లు, ఇంకా పలు ఎంటర్టైన్ మెంట్ షో లు కూడా బ్రేక్ లెస్ గా చూడొచ్చు. అయితే.. ఓటీటీలకు సెన్సార్ లేదు. ఇటీవల వచ్చిన ఓ వెబ్ సిరీస్ లో అడల్ట్ కంటెంట్ మరీ ఎక్కువగా చూపించడంతో.. ఓటీటీలకు సెన్సార్ ఉండాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దానితో పాటు టుబాకో యాడ్స్ కూడా లేవు.

థియేటర్లు, టీవీలలో సినిమాలు వేసే ముందు పొగాకు ప్రాణానికి ప్రమాదకరం, క్యాన్సర్ కు కారణం అనే యాడ్స్ తప్పనిసరిగా వేస్తారు. ఇది 2012 సంవత్సరం నుంచి అమలులో ఉంది. అయితే ఓటీటీలలో చాలా వరకూ ఈ యాడ్స్ ప్రసారం చేయట్లేదు. ఆయా ఓటీటీ సంస్థలకు తాజాగా కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. నిన్న మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ, కేంద్ర ఆరోగ్య శాఖ కలిసి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి.
ఇకపై ఓటీటీల్లో ప్రసారమయ్యే సినిమాలకు కూడా.. సినిమా థియేటర్స్, టీవీలలో వేస్తున్నట్టే పొగాకు ఆరోగ్యానికి హానికరం, పొగాకు క్యాన్సర్ కు కారణం అనే యాడ్స్ వేయాలని, కనీసం 20 సెకండ్ల నుంచి 30 సెకండ్ల వరకు ఆ యాడ్స్ ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది. విజువల్స్ తో పాటు ప్రాంతీయ భాషల్లో యాడ్ ఉండాలని తెలిపింది. ఇది అమలు చేసేందుకు మూడునెలల గడువు ఇచ్చింది. ఇది పాటించని ఓటీటీలపై కేంద్ర సమాచార ప్రసార శాఖ, కేంద్ర ఆరోగ్య శాఖ తరపున సీరియస్ గా యాక్షన్ తీసుకుంటామని తెలిపింది. తాజాగా కేంద్రం పంపిన ఉత్తర్వులతో ఓటీటీ సంస్థలు యాంటీ టుబాకో యాడ్స్ వేసేందుకు సిద్ధమవుతున్నాయి.


Tags:    

Similar News