జల్లికట్టులో విషాదం.. యజమానినే హతమార్చిన వృషభం

పొంగల్ వేడుకలను పురస్కరించుకుని తమిళనాడులో జల్లికట్టు నిర్వహించడం అనాదిగా వస్తోన్న ఆచారంగా మారింది. అక్కడ పొంగల్ అంటే..

Update: 2022-01-15 13:58 GMT

పొంగల్ వేడుకలను పురస్కరించుకుని తమిళనాడులో జల్లికట్టు నిర్వహించడం అనాదిగా వస్తోన్న ఆచారంగా మారింది. అక్కడ పొంగల్ అంటే.. గుర్తొచ్చేది జల్లికట్టే. ఏపీ - తమిళనాడు సరిహద్దు జిల్లా అయిన చిత్తూరులోనూ జల్లికట్టు కనిపిస్తుంటుంది. ఈ ఆట కాస్త సాహసోపేతమైనదే. బలిష్టమైన వృషభాల కొమ్ములకు బహుమతులు కట్టి బరిలోకి వదులుతారు. వాటిని తీసుకుని, వృషభాన్ని లొంగదీసేందుకు కొన్ని వందల మంది దాని వెంట పరిగెడుతుంటారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవచ్చు. అలాంటి సంఘటనలూ ఉన్నాయి.

తాజాగా తిరుచ్చి సమీపంలోని ఓ గ్రామంలో అలాంటి విషాద ఘటనే జరిగింది. సురియూర్ గ్రామంలో నిర్వహించిన జల్లికట్టులో ఓ ఎద్దు సొంత యజమానినే చంపేసింది. శ్రీరంగంకు చెందిన మీనాక్షి సుందరం అనే వ్యక్తి తన ఎద్దును జల్లికట్టుకోసమని సురియూర్ గ్రామానికి తీసుకొచ్చాడు. ఆ వృషభానికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం జల్లికట్టు బరి వద్దకు తీసుకెళుతుండగా అపశ్రుతి చోటుచేసుకుంది. ఆ ఎద్దు ఒక్కసారిగా కొమ్ములు విసరడంతో మీనాక్షి సుందరానికి తొడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో మీనాక్షి సుందరం చనిపోయాడు.


Tags:    

Similar News